కర్నాటకలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా అతడిని నరికి చంపారు.
ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లార పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చ నాయకుడిగా పని చేస్తున్న ప్రవీణ్ బీజేపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
ప్రవీణ్ బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో కోళ్ల అంగడి నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. కోళ్ల అంగడి నిర్వహిస్తున్న బీజేపీ నాయకుడు ప్రవీణ్ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కోళ్ల షాపు దగ్గర ఉంటున్నాడు. మంగళవారం రాత్రి కోళ్ల షాపు ముందు నిలబడి ఉన్న బీజేపీ నాయకుడు ప్రవీణ్ వేరేవ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆ సందర్బంలో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను వెంటాడి వెంటాడి వేటకొడవళ్లతో నరికేశారు. కొడవళ్లతో దాడి చెయ్యడంతో ప్రవీణ్ కుప్పకూలిపోయాడు. రక్తపుమడుగులో పడి ఉన్న ప్రవీణ్ ను వెంటనే పుత్తూరులోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ చనిపోయాడని వైద్యులు చెప్పారు. ప్రవీణ్ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుత్తూరులోని ఆసుపత్రి దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన నిందితులు బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ ను హత్య చేశారని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఈనెల 19వ తేదీన ఇదే ఊరిలో మసూద్ అనే యువకుడు హత్యకు గురైయ్యాడు. మసూద్ హత్యకు ప్రతీకారంగా బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య జరిగి ఉంటుందని అతని బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. బుధవారం ప్రవీణ్ శవానికి పోస్టుమార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రవీణ్ అంతిమ యాత్ర సందర్బంగా కొందరు యువకులు రాళ్ల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో రాళ్లతో దాడులు చెయ్యకూడదని పోలీసులు మనవి చేసినా కొందరు పట్టించుకోలేదు. ఆ సందర్బంలో పోలీసులు లాఠీలను పని చెప్పడంతో అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి..
ఈ హత్యపై కర్ణాటకలోని బీజేపీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే సీఎం బస్వరాజ్ బొమ్మై ఈ హత్య నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రవీణ్ నెట్టార్ హత్యతో బొమ్మై సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తియిన సందర్భంగా జనోత్సవ వేడుకలను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. బీఎస్ యడియూరప్ప, తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ల పూర్తి చేసుకుంది.. కానీ ప్రవీణ్ నెట్టారు హత్యతో ఆయన తల్లి, కుటుంబ సభ్యుల బాధను చూసి కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు బొమ్మై వెల్లడించారు. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య జరిగిన కొన్ని రోజులకే ప్రవీణ్ నెట్టారు హత్య జరగడం నన్ను తీవ్రంగా బాధించిందని బొమై అన్నారు.
రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వింగ్ తో పాటు కమాండోల టాస్క్ ఫోర్స్ కు శిక్షణ ఇస్తామని.. ఇలాంటి హత్యలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి.. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్న దేశ వ్యతిరేక, టెర్రర్ గ్రూపులకు అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే తాజాగా జరిగిన బీజేపీ కార్యకర్త హత్యలో అంతర్ రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయని.. ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని బస్వరాజ్ బొమ్మై అన్నారు. పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థ, వ్యక్తులను నిర్మూలించేందుకు ప్రత్యేక దళాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో మొత్తం 22 మంది యువకుల హత్యలు జరిగాయని.. వీటిపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. దీనికి బదులుగా ఈ ఘటనల వెనక ఉన్న సంస్థలపై 200 కేసులు ఉపసంహరించుకుందని.. దీంతో వారంతా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.