మహరాష్ట్ర సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన సర్కార్ మైనార్టీలోకి పడిపోయింది. షిండే వర్గం తిరుగుబాటుతో మహరాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అయితే అక్కడి పరిణామాలు పూట పూటకు ఆసక్తికరంగా మారుతున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చనే ఊహాగానాల నడుమ.. శివ సేన కీలక నేత సంజయ్ రౌత్ తాజా ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే పరిస్థితి సర్దుమణుగుతుందని ఆయన మీడియాకు చెప్పడం విశేషం. ఈ తరుణంలో దొరికిన అవకాశం చేజార్చుకోవద్దని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అస్సాం నుంచే ఇది మొదలైనట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేతో సహా మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్కు అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకున్నారు. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివ సేన రెబల్స్ గనుక తమతో చేతులు కలపాలని, బదులుగా భారీగా పోర్ట్పోలియో వాళ్ల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. రెబల్స్ గనుక తమతో కలిసి వస్తే.. ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఆఫర్ చేసింది. ఒకవేళ శివ సేన ఎంపీలు గనుక వస్తే.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. సీఎం ఉద్దవ్ థాక్రేను కలవకుండానే.. ఏక్నాథ్ షిండే మూడు పేజీల లేఖ రాయడం కలకలం రేపుతోంది. సీఎం థాక్రేను కలిసే ప్రసక్తేలేదని షిండే తేల్చి చెప్పారు. ఉద్ధవ్ ప్రతిపాదనలను సైతం షిండే తిరస్కరించారు. సీఎం ఎవరికీ అందుబాటులో ఉండట్లేదని… సీఎం ఇంటి తలుపులు ఇప్పుడు తెరుచుకున్నాయని ఏక్ నాథ్ షిండే లేఖలో వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇన్ని రోజులు దారుణంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. మమ్మల్ని ఇంత కాలం కలవలేదు…ఇప్పుడు మాత్రుశ్రీ లో ప్రజలను కలిస్తే సంతోషమని.. ఎన్నో సార్లు మీ పిఏ మాకు అపాయింట్ మెంట్ ఇస్తాను అన్నారు …కానీ అది ఎప్పుడు జరగలేదని ఆగ్రహించారు. ఇప్పటికి అయిన ప్రజలను కలవాలని లేఖలో ఉద్ధవ్ ఠాక్రే కు ఎక్ నాథ్ షిండే సూచించారు.
అయితే.. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని సంజయ్ రౌత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రెబల్స్లోనే 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, వాళ్లు ముంబైకి రాగానే పరిస్థితి సర్దుమణుగుతుందని రౌత్ ప్రకటించడం గమనార్హం. ఈడీకి భయపడి శివసేనకు ద్రోహం చేయాలనుకుంటున్నారని… అలాంటి వాళ్లు బాల్థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరంటూ సంజయ్ రౌత్ మీడియాతో అన్నారు. బలపరీక్ష ఎప్పుడు జరుగుతుందో అందరూ చూస్తారు, పార్టీని వీడే వారు బాలాసాహెబ్ భక్తులు కాదు.. ఇవాళ సీఎం ఉద్దవ్ థాక్రే ఎలాంటి భేటీ నిర్వహించబోవడం లేదంటూ స్పష్టం చేశారు.
మరోవైపు తిరుగుబాటు సూత్రధారి ఏక్నాథ్ షిండే సారధ్యంలోని రెబల్ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు. ఉద్ధవ్ థాక్రే సీఎం గద్దె దిగిపోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో జట్టు కడితేచాలని ప్రకటించారు. గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో షిండే బలప్రదర్శన నిర్వహించారు. 42మంది రెబల్స్ ఎమ్మెల్యేలతో షిండే పరేడ్ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా.. అలాగే శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బలప్రదర్శన వీడియోలను మహరాష్ట్ర గవర్నర్ కు పంపనున్నారు.