బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ముస్లిం యువకుడితో ప్రేమలో పడ్డ ఓ యువతి మనసు మార్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. భోపాల్లో 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని పెళ్లికి ముందు తన ప్రియుడు యూసుఫ్తో కలిసి పారిపోయింది. ఎంపీ స్వయంగా యువతికి ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూపించారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముస్లిం యువకుల ట్రాప్లో చిక్కుకుని మోసపోయిన హిందూ యువతుల జీవితం ఇతివృత్తంగా ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నచ్చజెప్పినా వినకుండా ఆ యువతి వెళ్ళిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.
నయా బసేరా ప్రాంతానికి చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని స్థానికంగా ఉంటున్న యూసుఫ్తో ప్రేమలో పడింది. యూసుఫ్ ఓ రౌడీ షీటర్.. అతడిపై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతడికి దూరంగా ఉండాలని యువతి కుటుంబ సభ్యులు చెబుతూ వచ్చారు. యువతి వివాహం మరో వ్యక్తితో నిశ్చయమైంది. మే 30న ముహూర్తం ఖరారైంది. మనసు మార్చేందుకు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ప్రయత్నించారు. ఆమెను వెంటపెట్టుకుని వెళ్లి ‘ది కేరళ స్టోరీ’ కు వెళ్లారు. ఆ తరువాత యువతి అనూహ్యంగా తన ప్రియుడితో వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లో తన పెళ్లి కోసం దాచిన నగలను కూడా వెంట తీసుకెళ్లిపోయింది. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూసుఫ్ తమ కూతురికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని ఆరోపించారు. ఆమెతో బ్యాంకులో అప్పు చేయించి ఈఎంఐలు కట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.