విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత బీసీ కులాలకు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. నిన్న 26 బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశామన్నారు. విశాఖలో మాధవ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలిచిన బీసీ కులాలను పట్టించుకోలేదన్నారు. బీసీలకు రావాల్సిన పథకాలు అందేలా చేయాలన్నారు. ఏపీ సీఎం జగన్ కూడా ఉత్తరాంధ్రపై దృష్టిపెట్టాలని, రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు హక్కులు కోల్పోయారని చెప్పారు. ఉత్తరాంధ్ర బీసీ కులాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో బీసీ కులాలు పెద్ద ఎత్తున గళం ఎత్తుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ పేరుతో ఎటువంటి అవకాశాలు కల్పించకుండా చేస్తున్నారని విమర్శించారు. డిసెంబర్లో బీసీ అన్యాయంపై భారీ బహిరంగంగా సభ నిర్వహిస్తామని వెల్లడించారు.