పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. పుర్బా బర్ధమాన్లోని శక్తిగఢ్లో బీజేపీ నేత రాజు ఝాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. దుర్గాపూర్కు చెందిన వ్యాపారవేత్త రాజు ఝా, తన సహచరులతో కలిసి కోల్కతాకు వెళుతుండగా శక్తిగఢ్లోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. కారులో రాజు ఝాతో సహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని బెంగాల్ పోలీసులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఝా ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఝా సహచరులు కూడా గాయపడడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో ఝా శిల్పాంచల్లో అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాడనే ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ ప్రభుత్వంలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో డిసెంబర్ 2021లో బీజేపీలో చేరారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని ఎన్నో దాడులు జరిగాయి. పలువురు బీజేపీ నేతలు ప్రాణాలు కోల్పోయారు.