More

    గుజరాత్‌ లో క్లీన్ స్వీప్ చేసిన BJP

    గుజరాత్… రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా పేర్కొంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ రాజ్యామేలిన ఈ రాష్ట్రంలో…. ఇప్పుడు హస్తం పార్టీని అక్కున చేర్చుకునేవారే కరువయ్యారు. తాజాగా గుజరాత్ లోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో….ఇది మరోసారి రుజువైంది. మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో 576 మున్సిపల్ వార్డులు..డివిజన్ల కు గాను… కాంగ్రెస్ పార్టీ కేవలం 45 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అది కూడా కాంగ్రెస్ తరపున నిలబడిన అభ్యర్థుల వ్యక్తిగత పలుకుబడిపైనేనట!

    అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ… కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించే అవకాశాలు ఉన్నాయా? అంటే కొంతమంది విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ లో 120 వార్డులు ఉండగా… అందులో బీజేపీ 93 స్థానాలతో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ ఖాతానే తెరువలేదు. అయితే ఆశ్చర్యకరంగా సూరత్ లో 27 వార్డులను గెలుచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అందర్నీ ఆశ్చర్యపర్చింది. బీజేపీ వ్యతిరేక ఓటు ఇంతకాలం కాంగ్రెస్ వైపునకు మళ్లేదని… అయితే ఇప్పుడదని ఆమ్ ఆద్మీ పార్టీ వైపునకు మళ్లిందని అంటారు. అలాగే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది పాటీదారు వర్గమని చెబుతున్నారు. 2015లో జరిగిన పాటిదార్ ఉద్యమంలో వీరందరూ కూడా క్రియాశీలకంగా పనిచేసినవారేనని…, పాటిదారు ఉద్యమ నేతగా ఎదిగిన హర్దిక్ పటేల్… కాంగ్రెస్ వైపునకు మళ్లడంతో… కొంతమంది ఆయనతో విబేధించి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కు సపోర్టు చేసే పాటీదార్ సమాజికవర్గానికి చెందినవారూ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలిపారని…అందుకే సూరత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లు గెలుచుకోగలిందని చెబుతున్నారు.

    రాష్ట్రవ్యాప్తంగా 576 వార్డులకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ…. కేవలం 45 వార్డులకే పరిమితం కావడాన్ని… ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే గుజరాత్ లో కాంగ్రెస్ పరిస్థితిని చూసి సెటైర్లు వేస్తున్నారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిలోకి రావడం… ఒక రకంగా ఇది కాంగ్రెస్ కు డేంజర్ సిగ్నలేనని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం గుజరాత్ లో ఆప్ పార్టీ ఉనికి…బీజేపీకి సైతం ప్రమాదమేనని అంటున్నారు.
    అయితే దాదాపు 30 ఏళ్ళ నుంచి గుజరాత్ రాష్ట్రాన్ని బీజేపీ పాలిస్తోంది. ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీతో మమేకమయ్యారా..? అనే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే…లోకసభ ఎన్నికల వరకు ఆ రాష్ట్రంలో జనం బీజేపీకే పట్టం కడుతున్నారు. చాలా సందర్భాల్లో గుజరాత్ లో బీజేపీపై వ్యతిరేకత కనిపించినా…, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాల సమ్మోహన శక్తి మూలంగా…, వారిని కాదని కాంగ్రెస్ కు అక్కడి ప్రజలు ఓట్లు వేయలేకపోతున్నారని.., ఈ విషయం పాటిదార్ మూవ్ మెంట్ లో స్పష్టంగా కనిపించదని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

    అలాగే గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ సారి మరోక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్-MIM పార్టీ గుజరాత్ లో సైతం తన ఉనికిని చాటుకుంది. దేశ వ్యాప్తంగా మజ్లిస్ పార్టీని బలోపేతం చేసేందుకు వరుస పర్యటనలు చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ… ఈసారి గుజరాత్ లోని ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారనే ప్రచారం జరురుగుతోంది. అహ్మదాబాద్ లో 21 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులను నిలిపింది. జమల్ పురా ప్రాంతంలోని మూడు వార్డులు, అలాగే మక్తంపురా లోని నాలుగు వార్డులను ఎంఐఎం గెలుచుకుంది. ట్రెడిషినల్ గా ఇవన్ని కూడా కాంగ్రెస్ వార్డులేనని చెబుతున్నారు.
    6 కార్పొరేషన్లలో ఫలితాలు ఇలా ఉన్నాయి..

    భావ్‌నగర్‌లో 52 డివిజన్లకు గాను భాజపా 44 స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ కాంగ్రెస్‌ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. జామ్‌నగర్‌లో 64 స్థానాలకు గాను భాజపా 50 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ 11 స్థానాలు, బీఎస్పీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. 120 స్థానాలు ఉన్న సూరత్‌లో భాజపా 93 స్థానాల్లో దూసుకెళ్లింది. తొలిసారి బరిలోకి దిగిన ఆప్‌ 27 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్‌ ఇక్కడ ఖాతా తెరవలేక చతికిలపడింది. రాజ్‌కోట్‌లో మొత్తం 72 డివిజన్లలో భాజపా 68 డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ నాలుగు చోట్ల ఆధిక్యం ప్రదర్శించింది. వడోదరాలో మొత్తం 76 స్థానాలకు గాను భాజపా 69 స్థానాల్లో విజయ సాధించింది. ఇక్కడ కాంగ్రెస్‌ కేవలం ఏడు స్థానాలకే పరిమితమైంది. అహ్మదాబాద్‌లో మొత్తం 192 స్థానాలు ఉండగా.. భాజపా 161 స్థానాలతో అఖండ విజయం సాధించింది. కాంగ్రెస్‌ 15 స్థానాలు గెలుచుకోగా.. ఎంఐఎం ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. 2015లో జరిగిన మున్సిపల్ పోరులో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం సీట్లు గెలుచుకుంటే…, ఈ సారి ఏకంగా 83 శాతం సీట్లు గెలుచుకుంది.

    ఇక… గుజరాత్ మున్సిపోల్స్ బీజేపీ ఘన విజయంపై ప్రధాని మోదీ, అలాగే అమిత్ షా స్పందించారు. బీజేపీకి మరోసారి ప్రజలు అందించిన అపూర్వ విజయానికి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా అనుకూల విధానాలే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఫలితాలు అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.

    ఇక గుజరాత్‌లో బీజేపీకి దక్కిన అఖండ విజయం తమ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అని అమిత్‌ షా అన్నారు. ఈ మేరకు ఆయన గుజరాతీలో ట్వీట్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి విజయం అందించిన అభినందనలు తెలిపారు.

    Trending Stories

    Related Stories