బిగ్ బుల్ ఆఫ్ ఇండియా రాకేష్ జున్‌జున్‌వాలా ఇక లేరు

0
782

భారత దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన రాకేష్ జున్‌జున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ అయిన రాకేష్ జున్‌జున్‌వాలా 62 ఏళ్ల వయసులో మరణించారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్‌ హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఝున్‌ ఝన్‌ వాలా మరో సారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత‍్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కాండీ బ్రీచ్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.

రాజస్థానీ కుటుంబానికి చెందిన రాకేష్ జూలై 5, 1960న జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో పెరిగారు. అతని తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్‌గా ముంబై లో పనిచేశారు. సిడెన్‌హామ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరాడు. కేవలం ₹ 5,000 పెట్టుబడితో కాలేజీ స్టూడెంట్ గా ఉండగానే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి.. తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన ఆస్తుల నికర విలువ $5.5 బిలియన్లు (జూలై 2022 నాటికి). భారతదేశంలో 36వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాకేష్ “బిగ్ బుల్ ఆఫ్ ఇండియా”, “కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్” అని ప్రసిద్ది చెందారు.

పెట్టుబడిదారుగా మాత్రమే కాకుండా జున్‌జున్‌వాలా ఆప్‌టెక్ లిమిటెడ్ , హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు. లిమిటెడ్, ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బిల్‌కేర్ లిమిటెడ్, ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోవోగ్ ఇండియా లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్, ఇన్నోవాసింత్ టెక్నాలజీస్ లిమిటెడ్, మిడ్ డే మల్టీమీడియా లిమిటెడ్, నాగార్జున కాన్‌స్టరుక్షన్ లిమిటెడ్, విసెర్చ్‌లో వంటి అనేక సంస్థలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. జెట్ ఎయిర్‌వేస్ మాజీ CEO వినయ్ దూబే కలిసి రాకేష్ జున్‌జున్‌వాలా ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థను ఇటీవలే స్థాపించారు. ఇంతలోనే ఆయన మరణించారనే వార్త వచ్చింది. 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్‌ మార్కెటర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 2018 నాటికి ఆయన ఆస్తి రూ.11వేల కోట్లకు పెరిగింది.