గో మూత్రం లీటరుకు రూ.4 చొప్పున రైతులు, పెంపకందారుల నుంచి కొనుగోలు చేయాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు శుక్రవారం వెల్లడించారు. మరో రెండు వారాల్లో ఉత్తర జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటికే రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి ఆవు పేడను సేకరిస్తోంది. పాలు ఇవ్వని ఆవులను రోడ్లపై వదిలేయకుండా, అవి భారం కాకుండా ఉండేందుకు, పశువుల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు 2020 జూన్ 25న ఈ పథకాన్ని ప్రారంభించింది. గో మూత్రాన్ని కూడా సేకరించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై పరిశోధనకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గో మూత్రాన్ని లీటరుకు రూ.4 చొప్పున కొనుగోలు చేయాలని కమిటీ నిర్ణయించింది. గ్రామ గౌతన్ సమితి ద్వారా గో మూత్రాన్ని కొనుగోలు చేసి యజమానులకు 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించనున్నారు. సేకరించిన గో మూత్రాన్ని వ్యవసాయంలో వినియోగించే సేంద్రీయ పురుగుమందుల తయారీకి మాత్రమే వినియోగిస్తారు.