కొవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ను విడుదల చేసింది. కరోనాపై కొవాగ్జిన్ టీకా 77.8శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు భారత బయోటెక్ శనివారం ప్రకటించింది. కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో కొవాగ్జిన్ టీకా 93.4శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ వెల్లడించింది. తీవ్ర లక్షణాలు నిలువరించి ఆస్పత్రిలో చేరే అవసరాన్ని కొవాగ్జిన్ తగ్గిస్తోందని వివరించారు.
కరోనా వైరస్పై మొత్తంగా 77.8 శాతం సమర్థతతో ఈ వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు పేర్కొంది. కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో 93.4 శాతం, డెల్టా వేరియంట్పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్టు భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ‘శాస్త్రీయ విశ్వాసం, సామర్థ్యం, నిబద్ధతతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో చేర్చడం మాకు గర్వకారణం.. ఆవిష్కరణ, క్లినికల్ రిసెర్చ్, డేటా, రక్షణ, సమర్థత వంటి 10 ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంటోంది.. మహమ్మారి సమయంలో సహకరించిన భాగస్వామ్యులు, శాస్త్రవేత్తల కృషికి ధన్యవాదాలు. వ్యాక్సిన్ సమూహంలో 24, ప్లేసిబో సమూహంలో 106 మొత్తం 130 కేసులను విశ్లేషించగా తాము అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనాపై 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది ’ అని సుచిత్ర ఎల్ల ట్వీట్ చేశారు.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను దేశవ్యాప్తంగా 18 నుంచి 98 ఏళ్లలోపు వ్యక్తులపై 25 ప్రాంతాల్లో నిర్వహించారు. రెండో డోస్ ఇచ్చిన రెండు వారాల తర్వాత కోవిడ్ లక్షణాలున్న 130 కేసులను పరిశీలించి డేటాను సేకరించారు. లక్షణాలు బయటపడని వ్యక్తులపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని, కోవిడ్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది.
వ్యాక్సిన్లు కరోనా నుండి కాపాడుతూ ఉన్నాయి. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే మహమ్మారి మరణాల ముప్పును 98 శాతం తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క డోసు తీసుకున్నా ఆ ముప్పు 92 శాతం తక్కువగా ఉంటుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ తెలిపారు. పంజాబ్ లో వ్యాక్సిన్ తీసుకున్న పోలీసులపై చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని డాక్టర్ వి.కె. పాల్ అన్నారు. 35,856 మంది పోలీసులు ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకుంటే.. అందులో కరోనా సోకి 9 మంది చనిపోయారని, వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిలో కరోనాతో చనిపోయింది 0.25 శాతమేనని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న 42,720 మందిలో కేవలం ఇద్దరే (0.05%) చనిపోయారన్నారు. వ్యాక్సిన్ తీసుకోని 4,868 మంది సిబ్బందిలో 15 మంది మృత్యువాత పడ్డారన్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా తీవ్రత తగ్గడమే కాకుండా మరణాల ముప్పునూ గణనీయంగా తగ్గించొచ్చని చెప్పుకొచ్చారు.