ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంస్థల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా భారత స్టాక్ మార్కెట్ పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. భారత బ్యాంకింగ్ రంగం కూడా ప్రభావితమవుతుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంక్ స్పందించింది. స్టార్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు పతనం అవుతున్నప్పటికీ దేశంలోని బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన విషయంలో భారతీయ బ్యాంకుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియా నివేదికలు ఉన్నాయని.. బ్యాంకుల రెగ్యులేటర్, సూపర్ వైజర్గా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించే ఉద్దేశ్యంతో బ్యాంకింగ్ రంగం, వ్యక్తిగత బ్యాంకులపై తాము నిఘా ఉంచుతామని ఆర్బీఐ తన ప్రకటనలో వెల్లడించింది. ఆర్బీఐ వద్ద సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ డేటాబేస్ సిస్టమ్ ఉంది. ఇది బ్యాంకులు రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ లావాదేవీలను నివేదిస్తాయని తెలిపింది. ఇది పర్యవేక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. ఆర్బీఐ ప్రస్తుత అంచనా ప్రకారం, బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉంది. మూలధన సమృద్ధి, ఆస్తి నాణ్యత, లిక్విడిటీ, లాభదాయకతకు సంబంధించిన వివిధ ప్రమాణాలు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా మార్కెట్ గురించి స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థల నియంత్రణ సజావుగానే సాగుతోందని.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఇలాంటి ఒక్క ఘటన భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సూచిక కాబోదని అన్నారు. అదానీ సంస్థల్లో ఎస్బీఐ, ఎల్ఐసీ పెట్టుబడులు పరిమితికి లోబడి ఉన్నాయని, ఆయా షేర్ల విలువ పడిపోయినప్పటికీ లాభాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదని నిర్మలా సీతారామన్ వివరించారు. ఆ మేరకు తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు. ఇప్పటికే ఎస్బీఐ, ఎల్ఐసీ తాజా పరిణామాలపై వివరణాత్మకంగా స్పందించాయని.. భారత బ్యాంకింగ్ సెక్టార్ ప్రస్తుతం ఘనమైన రీతిలో చాలా సౌకర్యవంతమైన స్థాయిలో ఉందని అన్నారు.