ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకిపోయింది. తాజాగా ఈ వేరియంట్ కేసులు భారత్ లో సైతం వెలుగుచూశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలో రెండు కేసులను గుర్తించినట్టు తెలిపింది. ఈ రెండు కేసులను కర్ణాటకలోనే గుర్తించినట్టు పేర్కొంది. 44 ఏళ్లు, 66 ఏళ్ల ఇద్దరు వ్యక్తుల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు తెలిపింది.
వీరిద్దరూ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) రికార్డుల ప్రకారం ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన ఆ డాక్టర్ కు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలుస్తోంది. ఎక్కడికెళ్లకుండానే ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. డిసెంబర్ 21న డాక్టర్ కు జ్వరం, ఒళ్లు నొప్పులున్నాయని, మరుసటి రోజు ఆర్టీపీసీఆర్ టెస్టులో అతడికి పాజిటివ్ వచ్చిందని బీబీఎంపీ రికార్డుల్లో పేర్కొన్నారు. శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపిస్తే.. 24వ తేదీన ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. మూడు రోజుల చికిత్స తర్వాత అదే నెల 27న అతడిని డిశ్చార్జి చేశారు. కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ బయట పడిన డాక్టర్ను కలిసిన వారిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఒమిక్రాన్ సోకిన డాక్టర్ కు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని మంత్రి వివరించారు. ఆయనను కలిసిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లకు విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో ఐదుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, డాక్టర్ సహా వారందరినీ ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచామని తెలిపారు. వారిలో ఎవరికీ ప్రమాదకర పరిస్థితి లేదని, వారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారేనని మంత్రి తెలిపారు.
మరో వ్యక్తికి ఒమిక్రాన్ వచ్చినా అతడు దుబాయ్ కు వెళ్లిపోయాడు. ఈ రెండు కేసుల్లో ఒకదానికొకటి ఎలాంటి సంబంధం లేదని బీబీఎంపీ రికార్డుల్లో పేర్కొంది. 66 ఏళ్ల వ్యక్తి చెప్పాపెట్టకుండా దుబాయ్ వెళ్ళిపోయాడు. గత నెల 20న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బాధితుడికి బెంగళూరు ఎయిర్ పోర్టులో కరోనా టెస్టు నిర్వహించారు. అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడంతో.. హోటల్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. అతడు అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేసుకున్నట్టు బెంగళూరు మునిసిపల్ అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో అతడు కొవిడ్ నెగటివ్ రిపోర్టుతోనే ఫ్లైట్ ఎక్కాడని.. బెంగళూరులో మాత్రం అతడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వైరస్ సోకినప్పటికీ అతడిలో లక్షణాలు లేవని గుర్తించిన వైద్యులు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.ఒమిక్రాన్ వేరియంట్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఎందుకైనా మంచిదని నవంబరు 22న అతడి నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్సింగుకు పంపారు. ఆ నివేదికలు రాకముందే బాధితుడు ఓ ప్రైవేటు ల్యాబ్ను సందర్శించి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడ అతడికి నెగటివ్గా తేలింది. అతడి ప్రైమరీ కాంటాక్ట్లు అయిన 24 మంది వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగటివ్గా నిర్ధారణ అయింది. వారిలో ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు. అదే నెల 22, 23 తేదీల్లో బాధితుడి సెకండరీ కాంటాక్ట్లు అయిన 240 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించగా, వారికి కూడా కరోనా సోకలేదని నిర్ధారణ అయింది. ప్రైవేటు ల్యాబులో చేయించుకున్న పరీక్షల్లో కరోనా లేదని స్పష్టం కావడంతో నవంబరు 27న అర్ధరాత్రి బాధితుడు హోటల్ నుంచి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్టుకు వెళ్లాడు. అక్కడ ఫ్లైటెక్కి దుబాయ్ వెళ్లిపోయినట్టు అధికారులు గుర్తించారు.
