పాస్ పోర్టు లేకుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ యువకులను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నలుగురిని రాజమహేంద్రవరంలో అరెస్టు చేయగా, మరో నలుగురిని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. మొదట బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ హావ్రాలోకి, అక్కడి నుంచి రైళ్లలో దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. వారంతా కొన్నేళ్ల క్రితమే పాస్పోర్టు లేకుండా డ్రైనేజీ పైపు ద్వారా భారత్లోకి చొరబడ్డారని పోలీసులు గుర్తించారు. వారి వద్ద అధికారిక పత్రాలు లేకపోవడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకోగా పలు విషయాలు తెలిశాయి. బెంగళూరు చిరుమానాతో నకిలీ ఆధార్కార్డులు, పాన్కార్డు, ఓటర్ కార్డులతో భారత్లో తిరుగుతున్నారని పోలీసులు తేల్చారు. 2017-2019 మధ్య వారంతా గోవాలో ఉన్నట్లు గుర్తించారు. భారత్లో కరోనా కారణంగా బంగ్లాదేశ్ కు వెళ్లారు. గత నెల క్రితమే మళ్లీ గోవాకు వచ్చి, భారత్లోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఎనిమిది మంది యువకులను పోలీసులు విచారిస్తున్నారు. వారి నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
నకిలీ గుర్తింపులతో దేశంలోకి చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు రెండు రైళ్లలో ప్రయాణిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమవ్వడంతో జూలై 3 న రాజమండ్రి, విజయవాడ రైల్వే స్టేషన్లలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) పోలీసు కె.వి. మోహన్ రావు మాట్లాడుతూ ఒక చిన్న క్లూ మేరకు పోలీసు బృందాలు రాజమండ్రి స్టేషన్కు వెళ్లి నలుగురు బంగ్లాదేశీయులను పట్టుకున్నట్లు తెలిపారు. “మేము వారి నుండి కొన్ని పత్రాలు మరియు వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాము” అని మోహన్ రావు అన్నారు. తోటి ప్రయాణీకులతో రైలులో గొడవ జరిగినప్పుడు బంగ్లాదేశ్ పౌరుల చొరబాటు వెలుగులోకి వచ్చింది. ఇది తీవ్రంగా మారడంతో ప్రయాణికులు పోలీసులను అప్రమత్తం చేశారని డిఐజి తెలిపారు.
అదేవిధంగా విజయవాడ పోలీసులు శనివారం తెల్లవారుజామున విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద నలుగురు చొరబాటుదారులను అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణపురం పోలీసులు పాస్పోర్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని విజయవాడ పోలీసు కమిషనర్ బి. శ్రీనివాసులు తెలిపారు. “వారి భారత పర్యటన యొక్క ఉద్దేశ్యం.. వారు దేశంలోకి ఎలా ప్రవేశించారు.. వారికి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మేము వారి గుర్తింపు కార్డులు మరియు ఇతర పత్రాలను పరిశీలిస్తున్నాము. దర్యాప్తు కొనసాగుతోంది” అని శ్రీనివాసులు అన్నారు.
బీహార్ లోని దర్భంగ రైల్వే స్టేషన్లో గత నెల 17న జరిగిన వస్త్రాల పార్సిల్లో పేలుడు కేసును అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ వ్యవహారంలో హైదరాబాద్లో నివాసముంటున్న నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్లను ఎన్ఐఏ ఇటీవలే అరెస్ట్ చేసింది. సికింద్రాబాద్ నుంచే పేలుడు పదార్థాల పార్సిల్ను దర్భంగా రైలులో పంపించినట్లు ఇప్పటికే తేలింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమై రైళ్లలో తనిఖీలు చేస్తోన్న ఏపీ పోలీసులకు బంగ్లాదేశ్ కు చెందిన వారు పట్టుబడడం కలకలం రేపుతోంది.