తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీని సమాధి చేస్తామని.. టీఆర్ఎస్ పై పోరాటానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలు, ఉద్యమకారులు తమతో కలసి రావాలని కోరారు. అమరవీరుల త్యాగల ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని.. తెలంగాణ ఏర్పాటులో తమ పార్టీ, దివంగత సుష్మాస్వరాజ్ పాత్ర కీలకమని అన్నారు. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా మూర్ఖత్వ పాలన నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డాక దళితుడిని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుకుకుంటానని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్నారని, ఆయన ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని సంజయ్ నిలదీశారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం, ఎంఐఎం కోసమే తెచ్చుకున్నారన్న చర్చ మేధావుల్లో జరుగుతోందని ఆయన చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ ఏయే హామీలు ఇచ్చారో ఇప్పుడెలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాలని ఆయన అన్నారు.
బీజేపీపై ఇతర పార్టీలు చేసే విమర్శలను తాము అసలు పట్టించుకోబోమని అవినీతికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లడంపై కూడా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. 18 మంది టీఆర్ఎస్ ముఖ్య నేతల అవినీతి వివరాలను సేకరించామని, వాటి గురించి ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని అన్నారు. సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర గురించి గత వారం రోజులుగా ఆరా తీస్తున్నామని చెప్పారు. ఈ కుంభకోణాల వివరాల గురించి తెలుసుకున్న తర్వాత కేసీఆర్ ఎంత అవినీతిపరుడో తెలిసిందని అన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ మరో వారం రోజుల్లో బీజేపీలో చేరుతారని సంజయ్ తెలిపారు. ఎలాంటి హామీలు లేకుండానే ఆయన బీజేపీలోకి వస్తున్నారని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ పాలన నచ్చే ఆయన బీజేపీలో చేరుతున్నారని అన్నారు.
ఈటల రాజేందర్ పై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన దిశగా వెళుతున్నారని, మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నానని అన్నారు. టీఆర్ఎస్ ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా బీజేపీకి మాత్రమే ఉందనేది తిరుగులేని వాస్తవం అని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారన్న భావం తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నిరూపితమైందని అన్నారు. తెలంగాణలో విద్యా రంగం కోమాలోకి వెళ్లిపోయిందని.. వైద్యం వెంటిలేటర్ల మీద ఉందని విజయశాంతి విమర్శించారు. అనేక సమస్యలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. కరోనా సమస్య లేకుండా పోతే దూకుడుగా పనిచేద్దామని బీజేపీ అనుకుందని.. కరోనా వల్ల కొంచెం మెల్లిగా పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో మరోసారి ఉద్యమం చేయాల్సి ఉందని.. ఆ ఉద్యమం బీజేపీ ద్వారా మొదలవుతుందని ఆమె చెప్పారు. తెలంగాణలో దొరల పరిపాలన పోవాలని విజయశాంతి పిలుపునిచ్చారు.