తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష.. కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శణాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ నాయకులు ‘తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష’ ను మొదలు పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు పూనుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షను మొదలుపెట్టారు. ఈ దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ పాల్గొన్నారు. ఆయన పిలుపు మేరకు పలువురు బీజేపీ నేతలు కూడా దీక్షలకు కూర్చున్నారు.
రైతులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉచితంగా యూరియా, విత్తనాలను రైతులకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. చెప్పింది చేయని ముఖ్యమంత్రి.. ఏమీ చేయని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ తీవ్ర విమర్శలకు దిగారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతుంటే ఏమీ పట్టనట్లు ఉంటున్నారని విమర్శించారు. ఓ సారి ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులు పెడతారు. మరోసారి ఉద్యోగులను ఇబ్బంది పెడతారు. ఇంకోసారి నిరుద్యోగులను ఇబ్బందులు పెడతారు…ఇలా అన్ని వర్గాల వారినీ ఇబ్బందులు పెడుతూ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులు పంట వేసేటప్పుడు భయపడుతున్నారు.. ఒక వేళ పంట చేతికి అందితే అకాల వర్షాలు ఎక్కడ పడతాయో అని భయపడుతున్నారు. కొనుగోళ్లు కేంద్రాల్లో మోసాలకు గురి చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. యాసంగి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తన ఫామ్హౌస్లో ఒక్క ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. రైతులు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఎందుకు అంతగా సంపాదించలేకపోతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతుల కోసం కేసీఆర్ ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులకు న్యాయం చేయడానికే తామీ దీక్షలను చేపట్టామని అన్నారు.
రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ‘‘తెలంగాణ రైతు గోస – బిజెపి పోరు దీక్ష’’లో భాగంగా తమ నివాసాల్లో దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మాజీ మంత్రి బాబూమోహన్ లు పాల్గొన్నారు.