More

    చంద్రబాబుకు భారీగా మైలేజీ పెరిగింది: బండి సంజయ్

    టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ పై తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భారీగా మైలేజ్ పెరిగిందని… ఎక్కడకు పోయినా వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందని అంటున్నారని సంజయ్ చెప్పారు. ఇలాంటి అరెస్ట్ తప్పని అందరూ అంటున్నారని తెలిపారు. తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేయాల్సిందేనని, శిక్ష పడాల్సిందేనని, అయితే చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలే తప్ప, ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడకూడదని అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేసే అరెస్ట్ చేశారని.. మాజీ సీఎం అరెస్ట్ విషయంలో కనీస నియమాలు పాటించలేదని అన్నారు.

    నిజాలు మాట్లాడితే తనను కూడా చంద్రబాబు ఏజెంట్ లేదా పవన్ కల్యాణ్ ఏజెంట్ అని చెప్పే దరిద్రపు అలవాటు వైసీపీ నేతలకు ఉందని సంజయ్ విమర్శించారు. వైసీపీ వాళ్లే సుద్దపూసలు అన్నట్టు మాట్లాడతారని.. వైసీపీ నేతలు నీతిమంతులా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి చాలా మైనస్ అని… వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారని అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తోందని అన్నారు. పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా దీనిపై స్పందిస్తున్నారని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజలు తప్పు అంటున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం తప్పును గ్రహించి, దాన్ని సరిదిద్దుకుంటే వాళ్లకే మైలేజ్ వస్తుందని అన్నారు. చంద్రబాబును జైల్లోనే ఉంచుతాం, బయటకు రానీయం అని అంటే ప్రజలు హర్షించరని అన్నారు.

    Related Stories