భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ను ప్రారంభించారు. దేశం నేడు కొత్త అసాధారణ దశగా ప్రయాణిస్తోందని అభివర్ణించారు. ఈ మిషన్ భారతదేశ ఆరోగ్య సదుపాయాలలో “విప్లవాత్మక మార్పులను” తీసుకువచ్చే శక్తిని కలిగి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ కింద ప్రతి భారతీయుడికి డిజిటల్ హెల్త్ ఐడీని ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక పౌరుడి హెల్త్ రికార్డు డిజిటల్ పద్ధతిలో సురక్షితంగా ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ వల్ల ఆరోగ్య నియంత్రణ మరింత సులభం అవుతుందని ప్రధాని అన్నారు. టెక్నాలజీ ఆధారంగా.. ఆయుష్మాన్ భారత్ రోగుల సేవల గురించి దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లకు విస్తరిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15 న ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు.. అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్-డయు, లఢక్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో అమలు చేయనున్నారు.
డిజిటల్ మౌళిక సదుపాయాలు భారత్ లో భారీ స్థాయిలో ఉన్నాయని, దేశంలో యూపీఐ విధానంలో అన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు. 118 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారని.. 80 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని అన్నారు. 43 కోట్ల మందికి జన్ధన్ అకౌంట్లు ఉన్నాయని, ఇలాంటి భారీ డిజిటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ దేశంలోనూ లేదని మోదీ అన్నారు. భారతీయ వైద్య ఆరోగ్య రంగంలో కల్పించే సదుపాయాల అంశంలో ఆయుష్మాన్ డిజిటిల్ మిషన్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుఖ్ మాండవీయ తెలియజేస్తూ, 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని ప్రకటించిన ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ సోమవారం ప్రారంభం కాబోతుండటం సంతోషంగా ఉందని అన్నారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను ఈ కార్యక్రమం తీసుకు వస్తుందన్నారు.
ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ ఐడీ అందిస్తారు. హెల్త్ అకౌంట్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. దీంతో ఎవరైనా భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడి చికిత్స అందించాల్సి వచ్చినా, మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్గా ఆ రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్ల ముందు ఉంటుంది.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) మూడవ వార్షికోత్సవం రోజునే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభమవుతుడటం విశేషమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది.