మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ కు సంబంధించి కొన్ని షరతులు విధించింది. అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేయంతో అవినాశ్ కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు రూ. 5 లక్షల పూచికత్తుతో రెండు షూరిటీలను సమర్పించాలని అవినాశ్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. సాక్షులను భయపెట్టడం, ఆధారాలను చెరపడం వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని తెలిపింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచించింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్రకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ చూపెట్టలేకపోయిందని హైకోర్టు వెల్లడించింది.