ఓ ర్యాలీలో పిల్లాడు మత విద్వేష నినాదాలు చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం ‘సేవ్ ది రిపబ్లిక్’ పేరుతో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా వందల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పిల్లాడు.. రెండు వర్గాలకు వ్యతిరేకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇదిలా ఉండగా.. PFI ఛైర్మన్ ఒమా సలామ్.. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. జ్ఞానవాపి మసీదుపై కొనసాగుతున్న వివాదం RSS అజెండాలో భాగమని సంచలన ఆరోపణలు చేశారు.
మరోవైపు.. రాజకీయ, మతపరమైన ర్యాలీల్లో పిల్లలను ఉపయోగించుకోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం ఈ కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ గోపినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు ఇలాంటి ద్వేషపూరిత వాతావరణంలో పెరగడం ఆందోళనకరమన్నారు. కొత్త తరాన్ని ఇలా పెంచడం కరెక్ట్ కాదు.. ఏదో ఒకటి చేయాలని ఆయన కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేరళ పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లాడిని ర్యాలీకి తీసుకువచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో పీఎఫ్ఐ అలప్పుజా జిల్లా అధ్యక్షుడు నవాస్ వందనం, జిల్లా కార్యదర్శి ముజీబ్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.