మియా పోయెట్రీ, మియా స్కూల్, ఇప్పుడు మియా మ్యూజియం. అస్సాంలో కొత్తగా ఏర్పడుతున్న పలు సంస్థలివి. ఆ రాష్ట్రంలో ఈ మధ్య ఇటువంటి సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిని ఏర్పాటు చేస్తోంది ఎవరో తెలుసా..? బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు..! అవును నిజం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు తమ సొంత సాహిత్యాన్ని, విద్యాలయాలతో పాటు మ్యూజియంలు కూడా ఏర్పాటు చేసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఏర్పాటు చేసిన ఒక మ్యూజియంను అస్సాం ప్రభుత్వం సీజ్ చేసింది. గోల్ పరా జిల్లా అధికారులు మియా మ్యూజియంను సీజ్ చేసి నోటీసులు అంటించారు. దీన్ని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మించారని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఫండ్స్ ను ఉపయోగించుకుని ఈ మ్యూజియంను కట్టారని, ఇది చట్ట విరుద్దమని గోల్ పరా జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఇక, మ్యూజియం వ్యవహారంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. అసలు అది మ్యూజియమే కాదన్నారు. అందులో చూపినవన్నీ ఇప్పటికీ ప్రజలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. అస్సామీల నాగలి, మత్సకారుల చేపల వలలే ఆ మ్యూజియంలో ఉన్నాయని, అందులో కొత్తవేమీ లేవని విమర్శించారు. అసలు పురాతన వస్తువులేవీ లేనిది మ్యూజియం ఎలా అవుతుందని ప్రశ్నించారు సీఎం బిశ్వశర్మ. అయితే అందులో ప్రదర్శించబడిన లుంగీ అస్సామీలదే కాదని స్పష్టం చేశారు. మ్యూజియంను ఏర్పాటు చేసిన వారు దీన్ని కేవలం అస్సామీ ప్రజలు మాత్రమే వాడారని నిరూపించాల్సిన అవసరముందని, లేకపోతే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిన వస్తుందన్నారు. అంతేకాదు, ఈ మ్యూజియానికి నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. వీటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన సీఎం దీనిపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. అయితే, వివాదానికి కారణమైన ఈ లుంగీని ఎక్కువగా బంగ్లాదేశీయులు ధరిస్తారు. అస్సాంలో చొరబడిన బంగ్లాదేశీ వలసవాద ముస్లింలు దీన్ని ఎక్కువగా ధరిస్తుంటారు. ఈ లుంగీపైనే సీఎం అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని కేవలం మియా ముస్లింలు మాత్రమే ధరిస్తారని చెప్పిన హిమంత బిశ్వ శర్మ, ఈ మ్యూజియంలో ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించారు. దీన్ని కేవలం మియా ముస్లింలు తప్ప మరొకరు ఉపయోగించరని మ్యూజియం నిర్వాహకులు నిరూపించాలని,.. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.
అయితే మియా ముస్లింలు బ్రిటిష్ కాలంలో భారత్లో స్థిరపడ్డారు. 1890లలో అప్పటి అవిభాజ్య బెంగాల్ నుంచి అస్సాంలోకి వలస వచ్చి స్థిరపడ్డారు. ఈ ముస్లింలలో ఉన్మాద భావజాలం కాస్తంత ఎక్కువగా కనిపిస్తుంది. మియా పోయెట్రీ అని సొంత సాహిత్యం కూడా తయారు చేశారు. ఇందులో హిందువులపై పూర్తి ద్వేషపూరిత భావజాలాన్ని నూరిపోస్తూ ఈ సాహిత్యాన్ని రూపొందించారు. వీటితో పాటు మియా స్కూళ్ళు, తాజాగా మియా మ్యూజియంలను కూడా ఏర్పాటు చేశారు. దీన్ని అస్సాం సీఎం తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి ఇలా పుట్టగొడుగుల్లా ఎందుకు పుట్టుకొస్తున్నాయో ముస్లిం మేధావులు ఆలోచించాల్సిన అవసరముందన్నారు అస్సాం సీఎం. గతంలో మియా పోయెట్రీ వచ్చినప్పుడు దీన్ని తాను ప్రశ్నిస్తే తనను మతతత్వ వాదిగా చిత్రీకరించారని.. ఇప్పుడు వాటికి అనుగుణంగా స్కూళ్ళు, మ్యూజియంలు కూడా ఏర్పాటవుతున్నాయన్నారు. ఇప్పటికైనా వీటిని అడ్డుకోకపోతే ఇవి మరింత పెరిగి స్థానిక ముస్లింలకు కూడా ప్రమాదంగా పరిణమించే అవకాశముందని తెలిపారు.
మియా మ్యూజియంను సీఎం గతంలోనే వ్యతిరేకించారు. 2020లో ఇదే ప్రాంతంలో మ్యూజియం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే షేర్మాన్ అలీ అస్సాం సీఎం ను కోరగా అప్పట్లోనే దీన్ని తిరస్కరించారు. అయినా కూడా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా.. ప్రభుత్వ నిధులతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేయశారు. మియా సంస్థల ఏర్పాటు అంశాన్ని సీరియస్ గా తీసుకున్న అస్సాం ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోంది.