రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్ష నేతలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మమత సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినా.. ఆ సమావేశానికి తాను హాజరయ్యేవాడిని కాదని చెప్పారు. కాంగ్రెస్ ను ఆహ్వానించారు కాబట్టి… ఆ సమావేశానికి తాము వెళ్లమని చెప్పారు. మమత పార్టీ టీఎంసీ తమ పార్టీ గురించి చాలా దారుణంగా మాట్లాడిందని, అలాంటప్పుడు వారి సమావేశానికి ఎలా హాజరవుతామని ఒవైసీ ప్రశ్నించారు. మొత్తం 19 రాజకీయ పార్టీల నేతలను సమావేశానికి మమత ఆహ్వానించారు. వీరిలో విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, హేమంత్ సోరెన్, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే ఉన్నారు. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఈ సమావేశానికి కేసీఆర్, కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు.