కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ లోక్సభ నుంచి బరిలోకి దిగాలని సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కూడా ఓడిపోతారన్న విషయం తనకు తెలుసని ఒవైసీ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీతో సహా ఒవైసీని సవాల్ చేసేందుకే తాను తెలంగాణకు వచ్చానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొనడంతో ఒవైసీ పై విధంగా స్పందించారు. హైదరాబాద్ నుంచి పోటీ చేసి, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఒవైసీ చురకలంటించారు. హైదరాబాద్ కాదంటే.. మెదక్ నుంచి కూడా పోటీకి దిగొచ్చని ఒవైసీ అన్నారు.
తెలంగాణలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చంచల్గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని రాహుల్ గాంధీ సూచించింది. అండగా ఉంటామని ఎన్ఎస్యూఐ నేతలకు రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా సందర్భంగా ఎన్ఎస్యూఐ నేతలను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు.
అంతకు ముందు దామోదరం సంజీవయ్య 50వ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ సంజీవయ్య పార్క్ లో సంజీవయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సమయంలో సంజీవయ్య పార్క్ వద్ద పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య గొడవ జరిగింది. పోలీసులు తమ వాహనాలు అనుమతించలేదని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో పలువురితో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం అయ్యారు. గద్దర్, హరగోపాల్, చెరుకు సుధాకర్, కంచె ఐలయ్యతో విడివిడిగా రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఉద్యమకారుల అభిప్రాయాలు, సూచనలు రాహుల్ తెలుసుకున్నారు.