హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి భౌతిక కాయం శుక్రవారం నాడు హైదరాబాద్ నగరానికి చేరుకుంది. రాత్రి 10 గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. సైనిక గౌరవాలతో నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మల్కాజిగిరిలోని ఇంటికి తరలించారు. స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామంలో వినయ్భాను భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపనున్నారు.
అరుణాచల్ ప్రదేశ్లో గురువారం భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. చాపర్ను నడుపుతున్న లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి, మేజర్ జయంత్ తుదిశ్వాస విడిచారు. బోమ్డిలా పట్టణానికి పశ్చిమాన మండాల సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. గురువారం ఉదయం 9.15 గంటలకు అరుణచల్ ప్రదేశ్లోని బోమ్డిలా సమీపంలో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో సంబంధాలు తెగిపోయాయని ఆర్మీ తెలిపింది. వినయ్ భాను రెడ్డి మృతితో బొమ్మల రామారం గ్రామంలో విషాదం నెలకొంది. సైన్యంలో ఉన్నతమైన స్థానానికి ఎదిగిన భాను రెడ్డి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. వినయ్భాను రెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ మల్కాజిగిరి లో ఉంటోంది.