ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ దళాలు ఆగస్టు 15న దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి అంతకు ముందు ఆఫ్ఘన్ సైన్యంలో పని చేసిన వాళ్లు, పోలీసు విభాగంలో ఉన్న వాళ్లు.. ఒక్కొక్కరిగా కనిపించుకుంటూ పోతున్నారు. నాలుగు ప్రావిన్సుల్లో 100 మందికి పైగా మాజీ పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు, సైన్యంలో పని చేసిన వారూ కనిపించకుండా పోయారు. వారిని తాలిబాన్లు ఉరితీయడం లేదా చంపేయడం జరిగిందని భావిస్తున్నారు. వారి అదృశ్యం వెనుక కారణం ఏమిటీ అన్నది ఇప్పటికీ తెలీకుండా ఉంది. పోలీసులను, సైన్యానికి తాలిబాన్లు క్షమాపణ ప్రకటించబడినప్పటికీ చాలా మంది అదృశ్యం అయ్యారని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలో తెలిపింది.
ఆఫ్ఘన్ జాతీయ భద్రతా దళాలకు చెందిన 47 మంది మాజీ సభ్యుల హత్య లేదా అదృశ్యం గురించి నివేదిక డాక్యుమెంట్ చేసింది
మరోవైపు సోమవారం, ఆఫ్ఘన్ జైలులో ఉన్న 210 మందికి పైగా ఖైదీలను తాలిబాన్లు విడుదల చేశారు. ఖొరాసాన్, సిరియా, ఇరాక్లలో ఇస్లామిక్ స్టేట్ ఆధారిత మిలిటెంట్ గ్రూపులు దేశంలో ప్రధాన ప్రజా భద్రత సమస్యగా ఎదుగుతున్నా తాలిబాన్ ఈ చర్యకు పూనుకుంది. ఆఫ్ఘనిస్తాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి తాలిబాన్ వందలాది మంది ఖైదీలను విడుదల చేసింది. హెల్మాండ్, ఫరా ప్రావిన్సులలోని జైళ్లలో ఉన్న 600 మందికి పైగా ఉగ్రవాదులను ఈ ఏడాది ప్రారంభంలో తాలిబాన్ విడుదల చేసింది.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో శాంతిభద్రతలు దారుణంగా దిగజారుతూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. దేశం విడిచి పారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వ్యాపారులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తాలిబాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు తమ రక్షణ కోసం ఆయుధాలను వెంట తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.