ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ ఘ్టనలో తొమ్మిది మంది టీచర్లను బాధ్యులుగా చేస్తూ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం, అంకిరెడ్డి పల్లె జడ్పీ హైస్కూల్ లో పది ప్రశ్నాపత్రం లీకేజీ వెనక కొందరు ప్రభుత్వ స్కూళ్ల తెలుగు టీచర్ల తో పాటు ప్రైవేట్ స్కూళ్ల హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తొమ్మిది మంది ఉపాధ్యాయుల హస్తం ఉన్నట్లు తేలడంతో వారిపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డి.ఎస్.పి రాజేంద్ర రెడ్డి వెల్లడించారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె జెడ్పీ పాఠశాల నుంచి ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్వైజర్, ఇన్విజిలేటర్లపై శాఖపరమైన చర్యలుంటాయని తెలిపారు. పశ్నపత్రం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశామన్నారు.