ఏపీ ఆర్థికశాఖలో సమాచారం లీక్ చేస్తున్నారంటూ ముగ్గురు ఉద్యోగులపై వేటు వేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులు శ్రీనుబాబు, వరప్రసాద్ సహా అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారన్న అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ముగ్గురు హెడ్క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.
కె.వరప్రసాద్, డి.శ్రీనుబాబు, నాగులపాటి వెంకటేశ్వర్లపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణ అనంతరం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ముగ్గురు ఉద్యోగులు టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు రాష్ట్ర ఆర్థిక అంశాలపై సమాచారం చేరవేస్తున్నారని, అందుకే వీరిపై చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.