ఏపీలో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోంది ఏపీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం అనుకున్నంత వేగంగా పనులు ముందుకు వెళ్లడం లేదు. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించేలా, అది కూడా ఆన్లైన్ వేదికగా విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఓ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం వల్ల సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది.