నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య కరోనా మందు పంపిణీ నేడు మొదలైంది. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని తెలిపారు. ఇప్పటికే కొవిడ్ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్ లోని మందు వాడాలని, కరోనా రాని వారు నీలం రంగు ప్యాకెట్ లోని మందు వాడాలని గోవర్ధన్రెడ్డి వివరించారు. సర్వేపల్లిలో మందు పంపిణీతోనే ఆనందయ్య మందు ఆగిపోదని, త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తామని తెలిపారు. రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేస్తామని చెప్పారు.
కరోనా ఔషధ పంపిణీలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని, అందుకే సవ్యంగా సాగట్లేదని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి అవసరమయ్యే మూలికలు, సామగ్రి సరిగ్గా సమకూరడం లేదని.. మందును తయారు చేసేందుకు యంత్ర సామగ్రిగానీ, విద్యుత్ సదుపాయాలూ లేవన్నారు. మందు తయారీకి ఏపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదని ఆరోపించారు. అనుమతులైతే ఇచ్చింది గానీ సాయం మాత్రం చేయలేదన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందన్నారు. ఇతర ప్రాంతాల వారు రావొద్దని సూచించారు.
ఆనందయ్య మరో శుభవార్త ఏపీ హై కోర్టు తెలిపింది. ఆనందయ్య ‘కె’ మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య ‘కె’ మందును ఇప్పటికే నిపుణుల బృందం పరిశీలించిన నేఫథ్యంలో.. ఆ మందును వెంటనే బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆనందయ్య తయారుచేసే పీ, ఎఫ్, ఎల్ మందులకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం.. కంట్లో వేసే చుక్కల మందుకు ఇంతకు ముందు అనుమతి ఇవ్వలేదు. అలాగే ‘కె’ మందుకు కూడా అప్పట్లో అనుమతి ఇవ్వలేదు. తాజాగా వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘కె’ మందు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాల్లేవని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.