ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలు వాయిదా పడింది. ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నవంబర్ 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు గతంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పుడు ఆ నిర్ణయం వాయిదా పడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవరిస్తూ సోమవారం కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలుకు ఒక్క రోజు ముందుగా సోమవారం (అక్టోబర్ 31) ఈ వ్యవహారంపై ఓ కీలక నిర్ణయన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారుల వినతి మేరకు నిషేధం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
విశాఖ పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ నగరంలో వెలసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీలను చూసి రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు బదులుగా వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించనున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారుల వినతి మేరకు వారికి మరికొంచెం సమయం ఇచ్చి.. జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది.