ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లకు అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లలో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ప్రేక్షకులు మాస్క్ లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో పలు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే..! ఈ నిర్ణయం చాలా సినిమాలకు ప్లస్ అవ్వనుంది.
సినిమా టికెట్ల ధరలపై ఏర్పాటైన కమిటీ సచివాలయంలో సమావేశమై టికెట్ ధరలపై చర్చించింది. ఫిలిం చాంబర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్ విలేకరులతో మాట్లాడుతూ మూడు శ్లాబుల్లో టికెట్ ధరలు ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ కనీస ధర రూ. 40గా, పట్టణ ప్రాంతాల్లో రూ. 70కి దగ్గరగా ఉండేలా చూడాలని సూచించినట్టు చెప్పారు.ఇందుకు సంబంధించి మరో వారం, పది రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు. సినిమా వ్యయం రూ. 100 కోట్లు దాటినప్పుడు టికెట్ ధరలు ఎలా ఉండాలన్న దానిపైనా చర్చించినట్టు చెప్పారు. ఐదో షో విషయంలో చిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్, సినీ నటుడు చిరంజీవి భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపైనా చర్చ జరిగిందన్నారు. కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, ప్రజలను, సినిమా పరిశ్రమను సంతృప్తి పరిచేలా నిర్ణయం ఉంటుందని తెలిపారు. థియేటర్లను ఏసీ, నాన్ ఏసీ, ఎయిర్ కూల్ వారీగా విభజిస్తారని తెలుగు ఫిలిం చాంబర్స్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ తుమ్మల సీతారాంప్రసాద్ అన్నారు.