పవిత్ర కాశీ నుంచి దాదాపు వంద సంవత్సరాల క్రితం చోరీకి గురై అన్నపూర్ణ విగ్రహం తిరిగి పూజలందుకునేందుకు సిద్ధమవుతోంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం కెనడా చేరింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దాన్ని తీసుకుని వచ్చింది. విగ్రహాన్ని వెనక్కి రప్పించేందుకు కెనడా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ విగ్రహాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ విగ్రహానికి అన్నపూర్ణ దేవి యాత్ర పేరుతో నాలుగు రోజుల పాటు శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఈ నెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విగ్రహానికి పునఃప్రతిష్ట జరగనుంది.
నాలుగు రోజుల యాత్ర సందర్భంగా అన్నపూర్ణ విగ్రహాన్ని తొలుత ఢిల్లీ నుంచి అలీఘడ్కు తీసుకువెళ్లనున్నారు. అక్కడ నుంచి 12వ తేదీన కన్నౌజ్కు తరలిస్తారు. ఆ తర్వాత 14వ తేదీన అయోధ్యకు తీసుకువెళ్తారు. ఇక చివరిగా 15వ తేదీన కాశీ విశ్వనాథ ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కెనడా ప్రభుత్వంతో అనేక సంవత్సరాలు చర్చలు జరిపి విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చామని.. కొన్ని రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు కూడా విదేశాల్లో ఉన్న విగ్రహాలను అందిస్తామని చెప్పారు. మన దేశానికి చెందిన అనేక విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని తెలిపారు. విదేశాల్లోని విగ్రహాలు, చిత్రపటాలు, చిహ్నాలను ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకొస్తున్నారని చెప్పారు.
భారతదేశానికి సంబంధించిన ఎన్నో పురాతన విగ్రహాలు ఇతర దేశాలకు వెళ్లిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అటువంటి విగ్రహాలను తిరిగి భారత్ కు తెప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలను తెచ్చారు. ఇప్పుడు మరో పురాతన విగ్రహం కూడా భారత్ కు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం ఫలితంగానే ఈ విగ్రహాన్ని భారత్ కు కెనడా తిరిగిచ్చిందని డివిజనల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ తెలిపారు. 100 ఏళ్ల క్రితం కాశీ నుంచి చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఎట్టకేలకు దాని స్వస్థలమైన వారణాసికి తిరిగి ఇస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే తెలిపారు. “100 సంవత్సరాల క్రితం కాశీ నుండి అన్నపూర్ణ మాత విగ్రహం దొంగిలించబడింది. అది చేతులు మారడంతో కెనడాలోని ఒక విశ్వవిద్యాలయంలో చేరింది. భారత ప్రభుత్వం ఆ విగ్రహాన్ని విశ్వవిద్యాలయం నుండి స్వీకరించింది, ఇప్పుడు దానిని యూపీ ప్రభుత్వానికి అందజేస్తోంది” అని సీఎం ఆదిత్యనాథ్ అన్నారు. శతాబ్ది క్రితం భారత్ నుంచి చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కెనడా నుంచి తెప్పిస్తున్నట్లు గతేడాది నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. విగ్రహాన్ని కెనడా తిరిగిచ్చిందని 2020 నవంబర్ 29న మన్ కీ బాత్ లో దేశ ప్రజలతో ప్రధాని మోదీ పంచుకున్నారు.