ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ నెల 18వ తేదీన మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 20 నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా.. రాబోయే రోజుల్లో రాయలసీమ, కోస్తాంద్రా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీకి ఎలాంటి తుఫాన్ ముప్పు లేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్లో నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్తున్న సమయంలో అల్పపీడనాలు ఏర్పడతాయని.. దీని ప్రభావంతోనే రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.