దొంగలు.. ఎప్పుడు ఎలా దొరికిపోతారో అసలు ఊహించలేము. తాజాగా చికెన్ పకోడీ సెంటర్ దగ్గర గొడవ ఓ దొంగ నోట్ల ముఠాను పట్టించేసింది. చికెన్ పకోడీని తినడానికి వెళ్లిన ఓ ముఠా సభ్యుడు అక్కడ ఇచ్చిన నోటు తేడా కొట్టడంతో జరిగిన గొడవ ఏకంగా ఆ బ్యాచ్ మొత్తాన్ని పట్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చికెన్ పకోడీ సెంటర్ వద్ద చోటు చేసుకున్న గొడవ కారణంగా అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. ఈ ముఠా సభ్యులు యూట్యూబ్ లో చూసి నోట్ల ముద్రణకు కావాల్సిన అన్ని వస్తువులను సమకూర్చుకోవడమే కాకుండా.. ప్రింటింగ్ కూడా చేశారట.. పెద్ద ఎత్తున ముద్రించి జనాలను బురిడీ కొట్టించాలని ప్రయత్నించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంకు చెందిన షేక్ నూర్ బాషా, ఖాజా, ఖీసీంలు బంధువులు. ఎన్నో అప్పులు చేసేసారు. తీర్చడం అంత సులువు కాదని గుర్తించారు. సులువుగా డబ్బు దొరికే మార్గాలను అన్వేషించారు. అందులో డబ్బులను ప్రింట్ చేయడం కూడా ఒక మార్గం అని అనుకున్నారు. యూట్యూబ్ లో డబ్బులు ఎలా ముద్రించాలో తెలుసుకున్నారు. నకిలీ నోట్ల తయారీకి కావాల్సిన వస్తువులను సమకూర్చుకున్నారు. రూ.100 నోట్లు ముద్రించి మార్కెట్లో మార్పిడి చేయాలని భావించారు.
అప్పటికే కొన్ని ప్రాంతాల్లో తక్కువ మొత్తంలో 100 రూపాయల నోట్లను మార్పిడి చేశారు. నూర్ బాషా జొన్నగిరి గ్రామం వెళ్లి చికెన్ పకోడీ తిన్నాడు. చికెన్ పకోడీ బండి నిర్వాహకుడికి తాము ముద్రించిన 100 నోటు ఇచ్చాడు.. ఐతే ఆ వందనోటు మారదని వేరేది ఇవ్వాలని అడిగాడు. నూర్ బాషా ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం మొదలైంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఖాన్ ను తనిఖీ చేయగా దొంగనోట్లు బయటపడ్డాయి. అతడి దగ్గర 30 దాకా రూ.100 నకిలీ నోట్లు గుర్తించారు. పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లి అతడిని విచారించగా మొత్తం బయటపెట్టాడు. యూట్యూబ్ లో నేర్చుకొని దొంగనోట్లు ముద్రించామని తెలిపారు. వజ్రకరూర్, గుంతకల్, మద్దికెర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణీ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగించిన జిరాక్స్ మిషన్, ప్రింటర్, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు జొన్నగిరి పోలీసులు తెలిపారు.