మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మా ఉన్నట్లుగా ఉప్పందించి భద్రతా బలగాలను మావోయిస్టులు ట్రాప్ చేసినందువల్ల.. ఇప్పడు భద్రతా బలగాలు అదే హిడ్మాను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ఆపరేషన్కు సన్నద్ధమయ్యాయి. హిడ్మాతోపాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ ప్రహర్-3’ చేపట్టాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
జవానుల బలిదానాలు వృధా కానివ్వం. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం.. ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ జరిపిన ఘాతుకానికి బదులిస్తూ కేంద్రహోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలివి. జస్ట్ అలా కామెంట్స్ చేసి వదిలేయడానికి ఇది పురానా జమానా కాదు అన్నట్లుగా కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. 24మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నవారికి తగిన గుణపాఠం చెప్పేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దీటైన జవాబు దగ్గర్లోనే ఉండేలా కనిపిస్తోంది. మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మా ఉన్నట్లుగా ఉప్పందించి భద్రతా బలగాలను మావోయిస్టులు ట్రాప్ చేసినందువల్ల.. ఇప్పడు భద్రతా బలగాలు అదే హిడ్మాను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ఆపరేషన్కు సన్నద్ధమయ్యాయి.
హిడ్మాతోపాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ ప్రహర్-3’ చేపట్టాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
ఇక కేంద్ర భద్రతాబలగాలు ‘మోస్ట్వాంటెడ్’ జాబితాను రూపొందించాయి. అందులో మావోయిస్టు కీలక కమాండర్లతో పాటుగా యువతను నక్సలిజం వైపు మళ్లిస్తున్న వ్యక్తులను కూడా గుర్తించాలని కేంద్ర హోంశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.
అయితే స్థానిక గెరిజన తెగ నుండి నాయకత్వ స్థాయికి ఎదిగిన మెరుపు దాడుల వ్యూహంలో మేటిగా పేరొందిన యువకుడు హిడ్మా చుట్టూ ఆపరేషన్ వ్యూహాలు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇతడే మావోయిస్టుల పలు దాడులలో కీలక పాత్ర వహించాడని పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవాడని చెబుతారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో ఆర్ అండ్ డీ విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై అతడికి పూర్తి పట్టు ఉన్నట్లు చెబుతారు. హిడ్మా తలపై రూ.40లక్షల రివార్డు కూడా ఉందంటే అర్ధం చేసుకోవాచ్చో అతడు ఎంతటి మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అనేది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్ఐఏ చార్జీషీట్ కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఎవరికైనా గగుర్పాటు తప్పదు..
2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు.
2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లుమృతి చెందారు.
2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు.
2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు.
2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.
దీంతో పాటుగా తాజాగా జరిగిన ఘటన కూడా ఇతడి వ్యూహమేననేది స్పష్టమవుతోంది.
వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ‘నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ను ముమ్మరం చేయండి. మానవ మేధస్సుతో పాటు సాంకేతికతను కూడా బాగా వాడండి. మిగతా భద్రతా సంస్థలు కూడా సహాయం చేస్తాయి’ అని అమిత్షా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఈ హిడ్మా బ్రతికి ఉన్నాడా లేదా లేక అతని పేరుతో పలువురిని రంగంలోకి దింపారా అనే కధనాలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా హిట్ లిస్ట్ లో ఇతడి పేరుతో పాటుగా మరో 8 మంది మావోయిస్టు కమాండర్లను చేర్చారు. వీరి ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.