పొలిటికల్ సర్కిళ్లల్లో పుకార్లను ఎవరు సృష్టిస్తారు? అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య రహస్య భేటీలనేవి రాజకీయాల్లో కామన్ గానే జరుగుతుంటాయి? అధికార పక్షానికి, విపక్షం నుంచి ఇబ్బందులు ఎదురైనప్పుడు…ఇలాంటి రహస్య భేటీల్లోనే సయోధ్యలు కుదురుతుంటాయని తలపండిన పొలిటికల్ పండితులు చెప్పేమాట.! అయితే రహస్య భేటీ తాలుకు రహస్యాన్ని ఎవరు లీక్ చేసినా…రెండు పక్షాలకు కూడా ఇబ్బందే.!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాలే అందర్ని దగ్గర చేస్తాయి. ఆ.. అవసరాలు తీరకపోతే వారే దూరంగా జరిగిపోతారు. లేదా దూరం చేయబడతారు.! ఐదేళ్ళ ఓట్ల పండుగ మొదలు.., అధికారంలోకి వచ్చేవరకు …, ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత.., తిరిగి దాన్ని నిలబెట్టుకునేందుకు, అలాగే మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు, రాజకీయా పార్టీల మధ్య, ముఖ్యంగా అధికార, విపక్షాల మధ్య, నిరంతరం వ్యూహా ప్రతివ్యూహాలు నడుస్తూనే ఉంటాయి.
మహారాష్ట్ర విషయానికి వస్తే ఇదే జరిగింది.! శివసేన పార్టీ…. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ రెండు పార్టీల కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కంటే తక్కువ సీట్లు గెలుచుకున్న శివసేన… సీఎం పదవి కోసం బీజేపీకి కటిఫ్ చెప్పింది. ఏ కాంగ్రెస్, ఎన్సీపీలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందో.., ఆ రెండు పార్టీలతో కలిసి కొత్త కూటమి కట్టింది. మహావికాస్ అఘాడీ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయవంతంగా ఏడాది కాలం కూడా పూర్తి చేసుకుంది.
ఇంత వరకు బాగానే ఉన్నా…,ఆ ప్రభుత్వం ఈ మధ్య అవినీతి ఆరోపణలు రావడంతో శివసేన, ఎన్సీపీ పార్టీల మధ్య కార్చిచ్చు రాచుకుంది. మహారాష్ట్ర హోంమంత్రి ఎన్సీపీకి చెందిన అనిల్ దేశ్ ముఖ్ పై.., సీనియర్ పోలీసు అధికారి అవినీతి ఆరోపణలు చేయడంతో.., ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఏర్పడ్డాయి. శివసేన నేతలు… , ఈ వ్యవహారంపై తమకు ఏమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహారించడం, అలాగే సామ్నా పత్రికలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పత్రిష్ఠను మసకబార్చేలా ఎడిటోరియల్ రాయడంపై. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సైతం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. కూటమి ఐక్యతా స్ఫూర్తినికి విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేయడం మంచింది కాదని ఎన్సీపీ నేతలు సైతం శివసేన నేతలకు హితవు పలికారు.
అయితే శివసేన, ఎన్సీపీ పార్టీల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో… ఎన్సీపీ అధినేత శరద్ పవార్… కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రహస్య సమాలోచనలు జరిపినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. అమిత్ షా మళ్లీ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం.., సరికొత్త ఎత్తులు వేస్తున్నారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని, నూతనంగా ఏర్పడే., బీజేపీ ప్రభుత్వానికి ఎన్సీపీ బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం పొలిటికల్ సర్కిళ్ళల్లో మొదలైంది.
అయితే ఈ భేటీపై.. ఇంత వరకు అటు ఎన్సీపీ కానీ, ఇటు బీజేపీ వర్గాలు కానీ అధికారికంగా స్పందించలేదు. అహ్మదాబాద్ లోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్సీపీ నేతలైన శరద్ పవార్, ప్రఫూల్ పటేల్ తో మీరు రహస్యంగా భేటీ అయ్యారా ? అంటూ కొంతమంది జర్నలిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. అయితే దీనికి అమిత్ షా తనదైన స్టయిల్లో అన్ని సంగతులు మీకు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కానీ.. భేటీ వార్తలను ఆయన ఖండించలేదు. ఇటు అమిత్ షా, శరద్ పవార్ ల భేటీ జరిగిన మాట వాస్తవమేనని శివసేన సైతం తన సోర్స్ ద్వారా రూడీ చేసుకుందని కూడా అంటున్నారు. ఎన్సీపీ నేతలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు.
ఇక ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే…అమిత్ షాతో భేటీ జరిగినట్లు వార్తలు వచ్చిన తర్వాత.., శరద్ పవార్ మీడియాకు దూరంగా ఉండటం మరింత అనుమానాలకు తావిచ్చింది. అయితే శరద్ పవార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, బుధవారం ఆయనకు శస్త్ర చికిత్స జరిగే అవకాశం ఉందని, ఈ కారణంగా ఆయన అధికారిక కార్యక్రమాలు అన్ని కూడా రద్దు చేశారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. సో ఇక ఈ భేటీపై ఎన్సీపీ మౌనంగా ఉండనుందని అర్థం చేసుకోవాలని రాజకీయ పండితులు చెబుతున్నారు. మరికొంతమంది అయితే పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు. ఏం జరుగనుందో మనమూ చుద్దాం.!