జమ్మూ కశ్మీర్ లో ఇటీవలి కాలంలో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే..! తీవ్రవాదుల హెచ్చరికలకు భయపడేది లేదంటూ ఇప్పటికే భద్రతా బలగాలు ప్రజలకు అభయమిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ టూర్ కు వెళ్లనున్నారు. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం జమ్మూకశ్మీర్లో అమిత్షా పర్యటించనుండటం ఇదే మొదటిసారి కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించింది. ఈనెల 23, 24 తేదీల్లో ఆయన పర్యటించబోతున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే సైతం ఈ పర్యటనలో పాల్గోనున్నారు.
అమిత్ షా కశ్మీర్లో ఉగ్రఘాతుకాలతో సహా వివిధ భద్రతా అంశాలపై సోమవారం నాడు రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల చీఫ్లతో చర్చించారు. న్యూఢిల్లీలో ని ఐబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
గత కొద్దిరోజులుగా స్థానికేతర కార్మికులను, అమాయకులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్నారు. ఇంతవరకూ 11 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపగా, వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాద ఏరివేత చర్యలను భద్రతా దళాలు తీవ్రం చేశాయి. డజనుకు పైగా ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో బీహార్కు చెందిన వలస కూలీలు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మరణించిన ఇద్దరిని జోగిందర్ రేషి దేవ్ మరియు రాజా రేషి దేవ్ గా గుర్తించారు. మూడవ బాధితుడు చుంచున్ రేషి దేవ్ ను ఈ దాడి తరువాత అనంతనాగ్లోని ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. శనివారం సాయంత్రం ఇద్దరు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఈ ఘటనల కారణంగా పలువురు కూలీలు కశ్మీర్ ను వీడుతూ ఉన్నారు.