చైనాకు కళ్లెం వేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్.. నాటో ప్లస్ కూటమిలోకి భారత్..!

0
327

భారత్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ మెప్పు పొందేందుకు అగ్రరాజ్యం ఆపసోపాలు పడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు కీలక పరిణామం జరిగింది. భారత్​ను నాటో ప్లస్ కూటమిలో చేర్చుకోవాలని అమెరికా కాంగ్రెస్​లోని అత్యంత శక్తిమంతమైన కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా నాటో ప్లస్ బలపడుతుందని చెప్పింది. అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీపై ఏర్పాటు చేసిన హౌస్ సెలెక్ట్ కమిటీ.. ఈ మేరకు ప్రతిపాదించింది. ఈ కమిటీకి మైక్ గాలగర్ ఛైర్మన్​గా, రాజా కృష్ణమూర్తి సభ్యుడిగా ఉన్నారు. తైవాన్​ భద్రత సహా నాటో ప్లస్ బలోపేతం కోసం భారత్​ను భాగస్వామిగా చేసుకోవాలని ఈ కమిటీ స్పష్టం చేసింది.

తైవాన్ భద్రతా డిమాండ్లను తీర్చడం సహా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో వ్యూహాత్మక పోటీలో విజయం సాధించాలంటే తన మిత్రపక్షాలు, భాగస్వాములతో అమెరికా తన సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భారత్​ను నాటో ప్లస్​లోకి చేర్చుకుంటే ప్రపంచ భద్రతకు పాటుపడటం సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సీసీపీ దూకుడుకు కళ్లెం వేయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తైవాన్​పై చైనా దాడి చేస్తే.. జీ7, నాటో, నాటో ప్లస్, క్వాడ్ కూటములు ఏకతాటిపైకి వచ్చి డ్రాగన్ దేశంపై ఆంక్షలు పటిష్ఠంగా అమలు అయ్యేలా చూడొచ్చని వారి అభిప్రాయం. చైనాపై ఆంక్షలు విధించే విషయంలో 2023 స్టాండ్ విత్ తైవాన్ యాక్ట్ తరహా చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించాలని ఈ కమిటీ సిఫార్సులు చేసింది.

నాటో ప్లస్ అనేది నాటో దేశాలకు, అందులో సభ్యులుగా లేని అమెరికా మిత్రదేశాలకు మధ్య వారధిగా నిలుస్తుంది. దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మెరుగుపర్చేందుకు ఈ ఏర్పాటు చేసుకున్నారు. నాటో ప్లస్​లో ప్రస్తుతం ఐదు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, దక్షిణకొరియాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. అందుకే దీన్ని నాటో ప్లస్-5 గానూ పిలుస్తారు. భారత్ ఈ కూటమిలో చేరితే ఈ దేశాలతో నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి మరింత వెసులుబాటు లభిస్తుంది. ఆయా దేశాల మిలిటరీ టెక్నాలజీని వేగంగా పొందే వీలు ఉంటుంది.

అయితే రిపబ్లికన్ పార్టీ నేతల నాయకత్వంలో ఈ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. దీన్ని చైనా కమిటీగా పిలుస్తుంటారు. భారత్​ను నాటో ప్లస్ కూటమిలోకి చేర్చుకునే ప్రతిపాదనపై భారతీయ అమెరికన్ రమేశ్ కపూర్ గత ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. 2024 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ లో సెలెక్ట్ కమిటీ సిఫార్సులకు చోటు దక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ జూన్​లో అమెరికాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడైన్​తో జూన్ 22న భేటీ అవుతారు. ఈ పర్యటనలో మోదీకి బైడెన్ అధికారికంగా డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. జీ20 శిఖరాగ్ర సదస్సుకు రావాలని బైడెన్​ను మోదీ ఆహ్వానించే అవకాశం ఉంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here