రొటీన్ మెయిన్టెనెన్స్ లో సాంకేతిక లోపం కారణంగా 9 మార్చి 2022న పాకిస్థాన్లోని ఒక ప్రాంతంపై దురదృష్టవశాత్తూ క్షిపణి వెళ్లిందని భారత్ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న ఘటన అంటూ భారతదేశం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారత ప్రభుత్వం సీరియస్గా భావించి ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాక్ భూభాగంలో క్షిపణి పడిన ఘటనను భారత రక్షణశాఖ తీవ్రంగా పరిగణించింది. క్షిపణి ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నెల 9న రోజువారీ నిర్వహణలో పొరపాటు జరిగిందని.. సాంకేతిక లోపం వల్లే క్షిపణి పాక్ భూభాగంలో పడిందని వివరణ ఇచ్చింది. పాక్ భూభాగంపై తమ క్షిపణి పడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది భారత్.
రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయంపై ప్రకటన చేశారు. ఈ నెల 9న ప్రమాదవశాత్తు మన మిస్సైల్ ఒకటి పాకిస్థాన్లో పడినట్లు తెలిపారు. సాధారణంగా జరిగే ప్రయోగాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు మిస్సైల్ దూసుకెళ్లిన అనంతరం అది పాకిస్థాన్లో పడినట్లు గుర్తించామని తెలిపారు. తాము ఇప్పటికే ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయుధ వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మన క్షిపణుల వ్యవస్థ అత్యంత సురక్షితం, నమ్మదగిందని తెలిపారు. మన నిపుణుల ప్రమేయం లేకుండానే ఆ క్షిపణి వెళ్లిందని చెప్పారు. ఇటువంటి ఘటనలు సరికావని తెలిపారు.
ఈ ఘటనపై అమెరికా వివరణ ఇచ్చింది. పొరపాటుగానే ఈ ఘటన జరిగిందని తెలిపింది. భారత్ చెప్పినట్టుగా ఈ ఘటన పొరపాటుగానే జరిగిందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఈ ఘటనపై ఈనెల 9న భారత్ వివరణ ఇచ్చిందని, అమెరికా దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
మిసైల్ వెళ్లిన అనంతరం.. భారతదేశానికి చెందిన సూపర్సోనిక్ క్షిపణి పాకిస్థాన్ మీదకు వచ్చిందని పాక్ అధికారులు తెలిపారు. మిసైల్ సిర్సా నుంచి టేకాఫ్ అయ్యిందని, పాక్ భూభాగంలోని 124 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో అది ల్యాండ్ అయిందని చెప్పారు. 40,000 అడుగుల ఎత్తులో దూసుకువచ్చిందని.. ఇలాంటి మిసైల్స్ ద్వారా భారత, పాకిస్థాన్ దేశాల గగనతలంలో ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. పాకిస్థాన్ వైమానిక దళం ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్ దీన్ని గమనించిందని తెలిపారు. పాక్ గగనతలం లోకి వచ్చి, చివరికి మియా చన్ను సమీపంలో పడిపోయిందని పాక్ తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఒక గోడ పడిపోయిందని పాకిస్థాన్ మిలిటరీ తెలిపింది.