బీజేపీలోకి పంజాబ్ మాజీ సీఎం.. పార్టీ సైతం విలీనం..!

0
804

పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బీజేపీలో చేరనున్నారు. పంజాబ్‌ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేయనున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ మాజీ సీనియర్‌ నేత అయిన 89 ఏళ్ల అమరీందర్‌ సింగ్‌ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. వెన్నుముఖ శస్త్రచికిత్స కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గత ఆదివారం అమరీందర్‌కు సర్జరీ జరిగింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో ఆయనతో మాట్లాడారు. అమరీందర్‌ సింగ్‌ వచ్చే వారం లండన్‌ నుంచి పంజాబ్‌కు తిరిగి రానున్నారు. అనంతరం ఆయన బీజేపీలో చేరడంతోపాటు తన పార్టీ పీఎల్‌సీపీని బీజేపీలో విలీనం చేయనున్నారు.

కాగా, 50 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి మూడు సార్లు సీఎంగా ఉన్న అమరీందర్‌ సింగ్‌ను గత ఏడాది సీఎం పదవి నుంచి కాంగ్రెస్‌ మార్చింది. దీంతో అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడారు. అనంతరం ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్‌ అయినా దక్కలేదు.

మరోవైపు పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల తర్వాత పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో అమరీందర్‌ సింగ్‌ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఆయన భార్య ప్రణీత్ కౌర్ పాటియాలా కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే తన కుమార్తె జై ఇందర్ కౌర్‌కు ఈ స్థానంలో అవకాశం ఇవ్వాలని బీజేపీని ఆమె కోరుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eleven − ten =