పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన నియోజకవర్గమైన ‘పాటియాలా అర్బన్’లో వెనుకంజలో ఉన్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన అమరీందర్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రత్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ కంటే వెనుక ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యం లోని ‘ఆప్ పార్టీ’ పంజాబ్లో అధికార కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చింది. సెప్టెంబరులో ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అమరీందర్ సింగ్ తన సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను స్థాపించారు.
పంజాబ్లో కాంగ్రెస్కు చెందిన పెద్ద నాయకులు ఇద్దరూ వెనుకంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ బాస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెనుకంజలో ఉన్నారు. చమ్కౌర్ సాహిబ్, భాదౌర్ నుండి పోటీ చేసిన రెండు నియోజకవర్గాల లోనూ చన్నీ వెనుకంజలో ఉన్నారు. చమ్కౌర్ సాహిబ్లో ఆప్ అభ్యర్థి చరణ్జిత్ సింగ్ ఆధిక్యంలో ఉండగా, భాదౌర్ స్థానం నుంచి ఆప్ పార్టీకి చెందిన లభ్సింగ్ ఉగోకే ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా అమృత్సర్ ఈస్ట్ స్థానం నుంచి వెనుకంజలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జీవన్జ్యోత్ కౌర్ ఆధిక్యంలో ఉన్నారు.