మైనర్ల అబార్షన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు

0
813

ప్ర‌తీ మ‌హిళ‌కు అబార్ష‌న్‌ను ఎంచుకునే హ‌క్కు ఉంటుంద‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరిస్తూ కీలక సూచనలు చేసింది ధర్మాసనం. ఎంపీటీ చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేసుకునే హక్కు ఉందని తేల్చి చెప్పింది. భారతదేశంలో అబార్షన్ చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య ఎటువంటి భేదం చూపదని.. 20-24 వారాల గర్భంతో ఉన్న ఒంటరి లేదా అవివాహిత గర్భిణీలను అబార్షన్‌కు అనుమతించకుండా నిషేధించలేమని చెప్పుకొచ్చింది. కేవ‌లం వివాహిత మహిళలనే అనుమతించడం అనేది ఆర్టికల్ 14 మార్గనిర్దేశక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. వైవాహిక అత్యాచారం కూడా అబార్షన్ల విషయంలో అత్యాచారంగానే భావించాల‌ని తెలిపింది. అసురక్షిత గర్భస్రావాలు ప్రసూతి మరణాలకు మూడవ ప్రధాన కారణమని.. దేశంలో జరుగుతున్న అబార్షన్లలో 60 శాతం సురక్షితం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఒక స్త్రీ తన భర్తతో ఏకాభిప్రాయం లేని శృంగారం ఫ‌లితంగా గర్భవతి కావచ్చు. వివాహిత భాగస్వామి ద్వారా కూడా ఒక మహిళ అత్యాచారానికి పాల్పడినట్లు క్లెయిమ్ చేస్తే అబార్షన్ కోసం అత్యాచారం ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.

పోస్కో చట్టం ప్రకారం అబార్షన్ చేయమని కోరితే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు మైనర్ యొక్క గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఎంటీపీ మైనర్‌లకు దూరం చేయడం చ‌ట్టం ఉద్దేశం కాదని తెలిపింది. స‌ద‌రు మహిళ ఉన్న‌ సామాజిక పరిస్థితులు ఆమె అబార్ష‌న్‌ రద్దు నిర్ణయంపై ప్రభావం చూపవచ్చని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. చ‌ట్టం ఎప్పుడూ స్థిరంగా ఉండ‌కూడ‌ద‌ని, మారుతున్న సామాజిక వాస్త‌వాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది.