అగ్నివీర్ల నియామకానికి సంబంధించి.. విశాఖపట్నం ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రిక్రూట్మెంట్ ప్రారంభమైంది. విశాఖలో 18 రోజులపాటు అగ్నివీర్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఏపీలోని శ్రీకాకుళం, ఎన్టీఆర్జిల్లాలకు చెందిన వారితోపాటు, యానాంకు చెందిన అభ్యర్థులు కూడా రిక్రూట్మెంట్కు కేటాయించిన తేదీలవారీగా హాజరవనున్నారు. ఆన్లైన్లో తొలిరోజు రిక్రూట్మెంట్ కోసం అడ్మిట్కార్డులు పొందిన అభ్యర్థులు శనివారం రాత్రే విశాఖలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియం పరిసరాల్లోనే అభ్యర్థులు నిద్రపోయారు. 300 మందికి పైగా ఆర్మీ అధికారులు, సిబ్బందితో పాటు.. 500 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మెడికల్, రెవెన్యూ సిబ్బంది అదనంగా ఉన్నారు. పరీక్షలు జరిగే స్టేడియంలోపల, అభ్యర్థులు వచ్చే మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల కోసం ఎక్కడికక్కడ సమాచారం తెలిపే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పోలీస్, రెవెన్యూ మెడికల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు ఆర్మీ అధికారులు.