ప్రపంచం మొత్తం చైనా నాసిరకం వస్తువుల్ని విసిరికొడుతుంటే.. పాకిస్తాన్కు మాత్రం అవే బంగారమయ్యాయి. చివరికి కరోనా టీకాలు సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. అత్తమీది కోపం దుత్త మీద చూపినట్టు.. ఇండియా వ్యాక్సిన్లు దిగమతి చేసుకోవడానికి ఇమ్రాన్కు ఈగో అడ్డొచ్చింది. ఓవైపు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వ్యాక్సిన్ల కోసం క్యూకడుతుంటే.. ఉగ్రవాద దేశాధినేత మాత్రం.. జిత్తులమారి డ్రాగన్ను నమ్ముకున్నాడు. అది ఎంత తప్పో ఇప్పుడు స్వయంగా అనుభవంలోకి వచ్చింది. చైనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఇమ్రాన్ కరోనా బారిన పడ్డాడు. ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ, రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్ కి సైతం టీకాతో రక్షణ లేకుండాపోయింది. తాజాగా వారిద్దరు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. పాక్ ప్రెసిడెంట్ ఆల్వీ టీకా మొదటి డోసు వేసుకున్న తర్వాత యాంటీబాడీలు డెవలప్ కాలేదు.
ఈ నెల మొదటి వారంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ఆయన భార్య సమీనా అల్వీ చైనాకు చెందిన వ్యాక్సిన్ సినోఫార్మ్ ఫస్ట్ డోస్ను తీసుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్కు కూడా ఈ చైనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాతే కరోనా సోకింది. ఇమ్రాన్ భార్య కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో.. చైనా వ్యాక్సిన్ అంత ప్రభావం చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. డాక్టర్లు మాత్రం ఆ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసేంత సమయం కూడా లేదని.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వ్యాక్సిన్ తీసుకోక ముందే కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పాకిస్తాన్ లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆ దేశ రాజధాని నగరం ఇస్లామాబాద్లో పాక్షిక లాక్డౌన్ను విధించారు. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో కూడా రెండు వారాల పాటు పాక్షిక లాక్డౌన్ విధిస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించేందుకు మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అసలే అంతంత మాత్రంగా ఉన్న అక్కడి ఆర్థిక వ్యవస్థ మరోసారి లాక్డౌన్ విధిస్తే కోలుకోలేని స్థితికి చేరుకుంటుందని.. పేదరికం, నిరుద్యోగం అతి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, లాహోర్తో పాటు ఇతర ప్రావిన్స్ ప్రాంతాల్లో ఏప్రిల్ 11 పాటు లాక్డౌన్ కొనసాగనుంది. ఈ లాక్డౌన్ సమయంలో వివాహ వేడుకలు గానీ, ఇతర వేడుకలు గానీ నిర్వహించకూడదని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పార్క్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేసి ఉంటాయని.. హోం డెలివరీకి అనుమతి ఉందని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపారు. మార్కెట్లు, బజార్లకు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉందని, శని, ఆదివారాల్లో పూర్తిగా మూసివేయాలని సీఎం ఆదేశించారు.