పాకిస్తాన్ కు చెందిన ఏజెంట్లతో రక్షణ రహస్యాలను పంచుకున్నందుకు ఒడిశా పోలీసులు మంగళవారం నాడు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క నలుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని డీఆర్డీఓలోని చండీపూర్ ఠాణాలో పని చేస్తున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (తూర్పు శ్రేణి) హిమాన్షు లాల్ చెప్పారు. “బాలసోర్ పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా, మన దేశం యొక్క భద్రత, సార్వభౌమత్వం మరియు సమగ్రతకు తీవ్రమైన హాని కలిగించే నేరానికి పాల్పడినందుకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు చేసి.. మరిన్ని ఆధారాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారని” పత్రికా స్టేట్మెంట్ ను విడుదల చేశారు.
ఈ నలుగురు డీఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగులని పోలీసులు అరెస్టు చేశారు. బాలాసోర్జిల్లా డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ హిమాన్షు లాల్ చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందని.. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. వీరికి పలు ఐఎస్డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. “సమాచారాన్ని విదేశీ ఏజెంట్లతో పంచుకున్నారు, పాకిస్తానీ ఏజెంట్లుగా కనిపిస్తున్నారు. అనుమానిత ఏజెంట్లను నిందితులు వేర్వేరు ISD ఫోన్ నంబర్లను ఉపయోగించి సంప్రదించారు. బదులుగా వారు కొన్ని ప్రయోజనాలను పొందుతున్నారు. వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము ”అని హిమాన్షు లాల్ చెప్పారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డీఆర్డీఓ స్పందించేందుకు నిరాకరించింది.
నిందితులపై IPC సెక్షన్ 120-B (నేరపూరిత కుట్రకు శిక్ష), 121-A (భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర) మరియు 34 (సాధారణ ఉద్దేశ్యంతో చేసిన చర్య), మరియు అధికారిక రహస్యాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి.