కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి.
భయంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే.. గత మూడు రోజుల్లో ఇలా ప్రకంపనాలు రావడం ఇది మూడోసారి కావడంతో ప్రజలు భయాందోనకు గురవుతున్నారు. కాగా. సుల్లియా పరిసర ప్రాంతాల్లో రెండోసారి ప్రకంపనలు రికార్డయ్యాయి. అయితే ప్రజలు మాట్లాడుతూ.. భారీ శబ్దంతో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో ఫర్నీచర్, రూఫింగ్ టాప్ షీట్లతో పాటు ఇంట్లో వస్తువులు కదిలాయని అన్నారు.
ఇంతకుముందు మూడు రోజుల క్రితం సుల్లియాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని, ఇవాళ మంగళవారం రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. కాగా.. బెంగళూరుకు 238 కిలోమీటర్ల దూరంలో.. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు వివరించింది. అయితే కర్నాటకలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ భూకంపాలను నిశితంగా పరిశీలిస్తున్నది.