ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాలుగా మారింది. అగ్రరాజ్యాలు సైతం వారి దాడులకు అల్లాడిపోతున్నాయి. ఐతే ఇరాక్ పశ్చిమ ప్రావిన్స్ అన్బర్ లో జరిగిన ఆపరేషన్ లో కొందరు ఐసిస్ నాయకులతో సహా మొత్తం 22 మంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు హతమయ్యారని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలోని రుత్బా పట్టణానికి ఉత్తరాన ఉన్న ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంపై వైమానిక దళం రెండు దశల్లో స్పెషల్ ఆపరేషన్ ను చేపట్టింది. ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ ను నిర్వహించిందని ఇరాక్ కౌంటర్ టెర్రరిజం సర్వీస్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్ సాది తెలిపారు.
స్పెషల్ ఆపరేషన్ లో హతమైన ఉగ్రవాదులందరూ బాంబులతో కూడిన పేలుడు బెల్టులు ధరించారనీ, మృతుల్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ ప్రారంభానికి ఖచ్చితమైన తేదీని వెల్లడించకపోయినా.. ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. తీవ్రవాదుల కార్యకలాపాలను అణచివేసేందుకు అక్కడి తీవ్రవాద వ్యతిరేక భద్రతా దళాలు గత కొన్ని నెలలుగా ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజా ఆపరేషన్ లో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అక్కడి వార్తా సంస్థ నివేదించింది. 2017లో ఐఎస్ ను ఓడించినప్పటి నుంచి ఇరాక్ లో భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయితే, దాని అవశేషాలు అప్పటి నుండి పట్టణ కేంద్రాలు, ఎడారులు, కఠినమైన ప్రాంతాలలోకి చొరబడి, భద్రతా దళాలు, పౌరులు టార్గెట్ గా తరచుగా దాడులు జరుగుతున్నాయి.
ఇక ఇరాక్ లో తీవ్రవాద గ్రూపుకు విధేయులుగా ఉన్న ఫైటర్ల అంచనాల ఆధారంగా స్థానిక, విదేశీ నిపుణుల మధ్య వ్యత్యాసం మారుతూ ఉంటుందని ఇరాక్ వర్గాలు ఐక్యరాజ్యసమితి నివేదికను ప్రస్తావిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపు ఇప్పటికీ ఇరాక్ లో 500 మంది క్రియాశీల ఫైటర్లను కలిగి ఉందని అంచనాలు ఉన్నాయని ఒక సైనిక అధికారి తెలిపారు. జిహాదీ వ్యతిరేక సంకీర్ణంలో భాగమైన ఇరాకీ జనరల్ ఖైస్ అల్ – మొహమదావి మాట్లాడుతూ.. ఐసీస్ ఇప్పుడు మారుమూల ఎడారి, పర్వత రహస్య స్థావరాలలో ఉందని.. అయితే, కొత్తగా ఇందులో చేర్చుకునే సామర్థ్యాలను కాస్త కోల్పోయిందని తెలిపారు.
ఇరాక్, పొరుగున ఉన్న సిరియాలో ఐసీస్ కు ఇప్పటికీ 5,000 నుంచి 7,000 మంది సభ్యులతో పాటు అనేక మంది మద్దతుదారులు ఉన్నారనీ, వీరిలో సగం మంది పోరాట చేసేవారని ఐక్యరాజ్యసమితి గత నెలలో ప్రచురించిన ఒక నివేదికలో అంచనా వేసింది. సామూహిక హత్యలు, చిత్రహింసలు, అత్యాచారాలు, బానిసత్వం వంటి క్రూరత్వానికి ప్రతీకగా 2014లో ఐసీస్ తీవ్రవాదులు రెండు దేశాల్లోనూ తమ స్వయం ప్రకటిత ప్రాంతాల్లో అరాచకాలు చేస్తున్నారు.