టీ-90 ట్యాంకు ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది చనిపోయారు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ సమీపంలో ఉన్న బాబినా కంటోన్మెంట్ లో చోటు చేసుకుంది. టీ-90 ట్యాంక్ బ్యారెల్ ఒక్క సారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ‘‘ ఝాన్సీ సమీపంలోని బబీనా కంటోన్మెంట్ లో టీ-90 ట్యాంకు బారెల్ పేలడంతో జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్), మరో ఆర్మీ సిబ్బంది చనిపోయారు. ఈ ఘటనపై విచారణకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించాం ’’ అని ఇండియన్ ఆర్మీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన టీ-90 ట్యాంకు మూడో తరం రష్యన్ ప్రధాన యుద్ధ ట్యాంకు.
అక్టోబరు 6, 2022న బాబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ జరుగుతున్నప్పుడు, ట్యాంక్ బ్యారెల్ పేలింది. ట్యాంక్లో ముగ్గురు సిబ్బంది సిబ్బంది ఉన్నారు. సిబ్బందికి తక్షణ వైద్య సహాయం కోసం మిలిటరీ ఆసుపత్రి బాబినాకు తరలించారు. కమాండర్, గన్నర్ గాయాలతో మరణించారు. డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు భారత సైన్యం ప్రగాఢ సానుభూతి తెలిపింది.రెండు రోజుల కిందట అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలి ఓ పైలెట్ లో చనిపోయిన ఘటన పూర్తిగా మరకముందే ఇది చోటు చేసుకోవడం బాధాకరం.