పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. నిన్న లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ కు గురికాగా, నేడు 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు.
సభలో నిరసనలకు దిగిన ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఈ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. డిప్యూటీ ఛైర్మన్ ఆమోదం తెలిపారు. సస్పెండ్ అయిన సభ్యులు తక్షణమే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈవారం చివరివరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు.
సస్పెండ్ అయిన సభ్యుల్లో కనిమొళి, మౌసుమ్ నూర్, సుస్మితా దేవ్, శాంతను సేన్, డోలా సేన్, శాంతా ఛెత్రీ, నదీముల్, రహీమ్, గిరిరాజన్ ఉన్నారు. అలాగే ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు కూడా సస్పెండ్ అయ్యారు. లింగయ్య యాదవ్, దామోదర్ రావు, రవిచంద్రలను వారం పాటు వేటు వేశారు. అయితే, సభ్యులు సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. దీంతో సభను వాయిదా వేశారు.