సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్ అల్లర్లకు సుబ్బారావు ప్రధాన కుట్రదారుగా పోలీసులు నిర్ధారించి.. రైల్వే కోర్టులో హాజరుపరిచారు. సుబ్బారావుతోపాటు అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సుబ్బారావు ఎనిమిది వాట్సాప్ గ్రూప్లను క్రియేట్ చేశాడని, వాటిద్వారా అభ్యర్థులను రెచ్చగొట్టాడని తెలిపారు. బీహార్ తరహాలో విధ్వంసం చేయాలని వాయిస్ మెసేజ్లు చేశారని.. ఈనెల 16న సాయంత్రమే సుబ్బారావు హైదరాబాద్ చేరుకున్నాడని, అల్లర్ల కోసం రూ.35 వేలు ఖర్చు చేశాడని వెల్లడించారు. అభ్యర్థులను కూడా అతడే తరలించాడని, ఎనిమిది ఫంక్షన్ హాళ్లలో వారికి మకాం ఏర్పాటు చేశాడని వెల్లడించారు. విధ్వంసాన్ని సుబ్బారావు అనుచరుడు బీసీ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించాడని తెలిపారు. మరో అనుచరుడు శివ ద్వారా రైల్వే స్టేషన్ విధ్వంసానికి ఆదేశించాడని తెలుసుకున్నారు పోలీసులు. పోలీసుల కాల్పుల్లో యువకుడు మరణించడంతో సుబ్బారావు హైదరాబాద్ నుంచి పారిపోయాడని, అల్లర్లు జరిగిన వెంటనే వాట్సాప్లో మెసేజ్లు డిలీట్ చేయాలని ఆదేశించాడని చెప్పారు.
విధ్వంసం లో పాల్గొన్న వారు 5 డిఫెన్స్ అకాడెమీ అభ్యర్థులేనని తేల్చారు. ఆర్మీ ఎగ్జామ్ లేకపోతే నష్టపోతామని భావించే అభ్యర్థులను నిరసన వైపు దారి మళ్లించారు డిఫెన్స్ అకాడెమీ నిర్వాహకులు. రిక్రూట్మెంట్ తర్వాత సెలెక్ట్ అయ్యిన అభ్యర్థుల నుండి 1 లక్ష 50 వేలు వసూలు చేస్తున్నాయి పలు అకాడెమీలు. సిటీలో ఉన్న పలు కోచింగ్ సెంటర్లలో ఒకే రకమైన ఫీ చెల్లింపు విధానం. ఫీజ్ చెల్లింపు విధానం తోనే అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయి అకాడెమీలు. చివరి దశలో పరీక్ష రద్ధైతే కోట్లలో అకాడమీలు నష్టపోతూ ఉండడంతో అభ్యర్థులను ఆందోళన వైపు ఉసిగొల్పారు.