తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచి విద్యార్థులను అనుమతించారు. ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల్లోగా పరీక్షల ఫలితాలు ప్రకటిస్తారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణలో 2,861 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా, 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రైవేట్ విద్యార్థులతో కలిపి మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు.
పదో తరగతి పరీక్షల కోసం తెలంగాణలో 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల సరళిని పర్యవేక్షించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈసారి 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.