100 కోట్ల వ్యాక్సిన్ల మైలు రాయిని అందుకున్న భారత్

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..! ఒకప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు.. ఇప్పుడు సైలెంట్ అయ్యాయి. తాజాగా భారత్ అరుదైన ఘనతను సాధించింది. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచింది. చైనా మాత్రమే వంద కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించింది. భారతదేశంలో ఈ ఏడాది జనవరి 16 న హెర్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. కరోనా ఫ్రంట్ లైన్ యోధుల అందరికీ ఇస్తూ.. దేశంలో ఫిబ్రవరి 19న కోటి డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఏప్రిల్ 11న 10 కోట్ల డోసులు వినియోగించిన దేశంగా భారత్ నిలిచింది. జూన్ 12న 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్తయింది. నేటితో 100 కోట్ల డోసుల వినియోగం పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్లో కన్నా 10 రెట్లు అధికమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశ జనాభాలో వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని మొత్తం 94.4 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్నది.